IndiGo: విమానప్రయాణంతో ఇబ్బంది పడ్డ విద్యార్థిని.. సాయం చేసిన కేంద్రమంత్రి

విమాన ప్రయాణంతో అసౌకర్యానికి గురైన ఓ విద్యార్థినికి కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింథియా( Jyotiraditya Scindia) స్వయంగా సహాయం అందించారు.

Updated : 05 Jul 2022 13:53 IST

దిల్లీ: విమాన ప్రయాణంతో అసౌకర్యానికి గురైన ఓ విద్యార్థినికి కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింథియా( Jyotiraditya Scindia) స్వయంగా సహాయం అందించారు. తన సామాన్లు చెంతకు చేరేలా చొరవ తీసుకున్నారు. ‘మీ సామాన్లు హాస్టల్ గేట్ వద్దకు చేరుకున్నాయి. జాగ్రత్తగా ఉండండి’ అంటూ ఆమె సమస్యను పరిష్కరించారు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..

ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో(IndiGo)లో జులై ఒకటిన అనౌష్క ప్రయాణించారు. ఆ ప్రయాణంలో ఆమె తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. దానిని ట్విటర్ వేదికగా వెల్లడిస్తూ.. సంస్థపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఇండిగో విమానంలో ప్రయాణించిన సమయంలో నేను తీవ్రంగా ఇబ్బందిపడ్డాను. వారి అసమర్థత, ఆలస్యాల కారణంగా నా గమ్యస్థానం చేరుకోవడానికి 24 గంటల వ్యవధిలో నాలుగు విమానాశ్రయాలకు వెళ్లాల్సి వచ్చింది. చివరకు ఎలాగోలా చేరుకుంటే.. నా సామాన్లు డెలివరీ కాలేదని తెలిసింది. ఇప్పుడేమో విమానాశ్రయానికి వచ్చి, సామాన్లు తీసుకువెళ్లాలని చెప్తున్నారు. నేను ఇంకా ఎంత ఇబ్బందికి గురవ్వాలి. నా కళాశాల నగర శివార్లలో ఉంటుంది. అక్కడి నుంచి క్యాబ్‌లో రావాలంటే నాకు చాలా మొత్తమే ఖర్చవుతుంది. మీ అసమర్థతకు కూడా చెల్లించేలా చేస్తున్నారు’ అంటూ ట్విటర్‌ వేదికగా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇది కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య దృష్టికి వెళ్లింది. వెంటనే ఆయన చొరవ తీసుకుని సామాన్లు ఆమె వద్దకు వచ్చేలా చూశారు.

ఇదిలా ఉంటే.. రెండు రోజుల క్రితం ఇండిగో కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం కలిగిన సంగతి తెలిసిందే. మొత్తం సిబ్బందిలో దాదాపు సగానికిపైగా సిక్‌ లీవ్‌లో వెళ్లడం చర్చనీయాంశమైంది. దాంతో విమానాలు ఆలస్యంగా నడిచాయి. దాదాపు 900 సర్వీసులపై ప్రభావం పడినట్లు పౌర విమానయాన శాఖ ధ్రువీకరించింది. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన డీజీసీఏ.. ఇండిగో ఎయిర్‌లైన్స్‌ నుంచి వివరణ కోరింది. అయితే, సిక్‌లీవ్‌ పెట్టిన సిబ్బంది అంతా ఎయిర్‌ ఇండియా నిర్వహిస్తోన్న ఉద్యోగ నియామకాల ఇంటర్వ్యూల కోసం వెళ్లినట్లు వార్తలు వచ్చాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని