Havana syndrome: అమెరికన్లను భయపెడుతున్న హవానా సిండ్రోమ్‌..!

అమెరికా దౌత్యవేత్తలను ఓ ప్రత్యేమైన సిండ్రోమ్‌ తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. అది ఎందుకు వస్తోందో అగ్రరాజ్యం శాస్త్రవేత్తలకు అంతుపట్టడంలేదు.. ఎవరో తమపై కుట్ర పన్నుతున్నారన్న అనుమానం కూడా అమెరికాలో

Updated : 25 Aug 2021 13:50 IST

ఉపాధ్యక్షురాలి పర్యటనలో తీవ్ర జాప్యం

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

అమెరికా దౌత్యవేత్తలను ఓ ప్రత్యేమైన సిండ్రోమ్‌ తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. అది ఎందుకు వస్తోందో అగ్రరాజ్యం శాస్త్రవేత్తలకు అంతుపట్టడంలేదు.. ఎవరో తమపై కుట్ర పన్నుతున్నారన్న అనుమానం కూడా అమెరికాలో ఉంది. తాజాగా అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ వియత్నాం పర్యటన ఈ సిండ్రోమ్‌ కారణంగానే కొన్ని గంటలపాటు ఆలస్యమైంది. వియత్నాంలోని దౌత్య కార్యాలయం నుంచి ఓ వ్యక్తిని అత్యవసరంగా చికిత్స నిమిత్తం తరలించాల్సి వచ్చింది.

ఏమిటీ సమస్య..

అమెరికా దౌత్యవేత్తలను మాత్రమే పీడించే ఈ సమస్యను ‘హవానా సిండ్రోమ్‌’ అని అంటారు. 2016లో తొలిసారి దీనిని క్యూబాలో హవానా నగరంలోని అమెరికా దౌత్యకారాలయ సిబ్బందిలో గుర్తించారు. మెదడుపై ఏదో తెలియని తీవ్రమైన ఒత్తిడి కలుగుతుంది. కందిరీగల దండు తమ వద్ద తిరుగుతున్నట్లు చప్పుడు వినిపిస్తుంటుంది. ఈ శబ్దం భరించలేని స్థాయిలో ఉంటుంది. దీని ప్రభావానికి గురైన వ్యక్తికి వికారం కలుగుతుంది. అంతేకాదు, విపరీతంగా అలసటతో పాటు.. ఏ విషయాన్ని గుర్తుపెట్టుకోలేరు. క్యూబాలో ఈ ప్రభావానికి లోనైన వారిలో మూడోవంతు మందికి వినికిడి శక్తి దెబ్బతింది. వారి మెదడును స్కాన్‌ చేసిన డాక్టర్లకు ఆశ్చర్యకరమైన విషయాలు తెలిశాయి. ఈ సిండ్రోమ్‌ బారిన పడిన వారి మెదడు దెబ్బతిన్నట్లు గుర్తించారు. సాధారణంగా ఏదైనా ప్రమాదానికి గురైతే కానీ ఆ స్థాయిలో మెదడు దెబ్బతినదు. తొలిసారి హవానాలో బయటపడటంతో ఆ పేరుతోనే పిలుస్తున్నారు.

కొన్ని రకాల ఉద్యోగులు మాత్రమే ఈ సిండ్రోమ్‌ బారిన పడుతున్నారు. క్యూబా, చైనా దౌత్యకార్యాలయాల్లో పనిచేసే వారే ఎక్కువగా ఉన్నారు. దౌత్యవేత్తలు, గూఢచారులు, సైనిక సిబ్బంది, సీఐఏ సిబ్బంది, విదేశాగ శాఖ సిబ్బంది ఈ జాబితాలో ఉన్నారు. గత ఐదేళ్ల నుంచి దాదాపు 200 మంది దీని బారిన పడి ఉంటారని అంచనా. మైక్రోవేవ్‌ తరంగాల సాయంతో గుర్తుతెలియని ప్రత్యర్థులు దాడులు చేస్తున్నారని అమెరికా అనుమానిస్తోంది. చైనా, ఆస్ట్రియా, పోలాండ్‌, రష్యాలోని అమెరికా దౌత్య సిబ్బంది ఈ సిండ్రోమ్‌ బాధితుల జాబితాలో ఉన్నారు. కొందరు కెనడా దౌత్యవేత్తలు కూడా ఈ సిండ్రోమ్‌ బారినపడినట్లు వార్తలొచ్చాయి.

2019లో కారులో ఉన్న ఒక అమెరికా సైనిక అధికారికి ఒక్కసారిగా తీవ్ర వికారంగా అనిపించింది. అదే సమయంలో వెనుకసీటులో ఉన్న అతడి రెండేళ్ల కుమారుడు కూడా విపరీతంగా ఏడవటం మొదలు పెట్టాడు. వారు కారు నుంచి బయటకు వచ్చిన కొద్దిసేపటి తర్వాత ఆ లక్షణాలు తగ్గాయి. అతని కుమారుడు కూడా కుదుట పడ్డాడు. ఈ ఘటన అమెరికా ప్రభుత్వాన్ని కలవర పర్చింది.

క్యూబా పై నింద..

అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్‌ ఉన్న సమయంలో ఈ సిండ్రోమ్‌ వ్యాప్తికి క్యూబాను నిందించారు. కానీ, క్యూబా దీనిని తిరస్కరించింది. కానీ, ఆ తర్వాత అమెరికాలోని అధికారులు కూడా దీని బారిన పడినట్లు తేలింది. ప్రభుత్వం ఈ సిండ్రోమ్‌కు కారణమేంటో తెలుసుకొనే పనిలో పడింది. కొన్నాళ్ల క్రితం బైడెన్‌ కార్యవర్గం కూడా దీని సంగతేమిటో తేల్చాలని నిశ్చయించుకొంది. ఈ విషయంపై జూన్‌లో సెక్రటరీ ఆఫ్‌ స్టేట్‌ ఆంటోనీ బ్లింకన్‌ ఒక ప్రకటన చేశారు.

తొలుత అమెరికా కొన్ని రకాల ‘సానిక్‌’ శబ్ద తరంగాల కారణంగా ఈ పరిస్థితి తలెత్తుతోందని అనుమానించింది. కానీ, అది తప్పు అని తేలడంతో ఇప్పుడు మైక్రోవేవ్‌ తరంగాలను వినియోగిస్తున్నట్లు బలంగా నమ్ముతోంది. ది నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ సైన్స్‌, ఇంజినీరింగ్‌ అండ్‌ మెడిసిన్‌ (ఎన్‌ఏఎస్‌ఈఎం) పరిశోధనల ప్రకారం మైక్రోవేవ్‌ తరంగాలను వినియోగించే అవకాశం ఉందన్న అంచనాలకు వచ్చారు. సోవియట్‌ యూనియన్‌ 1950ల్లో మైక్రోవేవ్‌ తరంగాలను ఆయుధంలా వినియోగంచడంపై పరిశోధనలు చేసిన విషయాన్ని ప్రస్తావించారు. 2019లో జర్నల్‌ ఆఫ్‌ అమెరికన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ కూడా ఎన్‌ఏఎస్‌ఈఎం నివేదికను బలపర్చింది.

కమలా హారిస్‌ పర్యటన జాప్యం..

అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ ఆసియా దేశాల పర్యటనపై హవానా సిండ్రోమ్‌ ప్రభావం పడింది. వియత్నాంలోని అమెరికా దౌత్య సిబ్బంది హవానా సిండ్రోమ్‌ వంటి సమస్య బారిన పడినట్లు తేలింది. ఈ సారి దౌత్య సిబ్బంది ఇంటి వద్ద ఈ పరిస్థితి తలెత్తింది.  గతంలో ఇక్కడి సిబ్బంది ఈ సమస్యతో ఇబ్బంది పడ్డారు. ఈ విషయాన్ని సీబీఎస్‌ న్యూస్‌ పేర్కొంది. దీంతో ఒక్కసారి అప్రమత్తమైన అమెరికా సిబ్బంది కమలా పర్యటన ఏర్పాట్లను మరింత కట్టుదిట్టం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని