Karnataka: కర్ణాటకలో కాంగ్రెస్‌.. ఆ హామీల అమలుకు రూ.62వేల కోట్లు..?

కర్ణాటకలో (Karnataka) అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించిన ఐదు గ్యారంటీలను (Congress 5 Guarantees) అమలు చేస్తే ప్రభుత్వానికి ఏడాదికి రూ.62వేల కోట్ల వ్యయం అవుతుందని అంచనా.

Published : 16 May 2023 01:31 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కర్ణాటకలో (Karnataka) అధికారంలో ఉన్న భాజపాను ఓడించి కాంగ్రెస్‌ (Congress) పార్టీ పూర్తి మెజార్టీతో ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైంది. కాంగ్రెస్‌ విజయానికి అనేక అంశాలు దోహదం చేసినప్పటికీ.. మేనిఫెస్టోలో ప్రకటించిన ఐదు ఉచిత పథకాలు (Congress 5 Guarantees) మాత్రం సానుకూల ప్రభావం చూపించినట్లు అర్థమవుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ ఇచ్చిన ఐదు ‘గ్యారంటీలు’ అమలు చేస్తే కనుక.. ఏడాదికి సుమారు రూ.62వేల కోట్ల వ్యయం అవుతుందని అంచనా. ఇది ఆ రాష్ట్ర బడ్జెట్‌లో దాదాపు 20శాతంతో సమానమని పలు సంస్థలు అంచనా వేస్తున్నాయి.

తాము అధికారంలోకి వస్తే మేనిఫెస్టోలో ఇచ్చిన గ్యారంటీలు నెరవేరుస్తామని కాంగ్రెస్‌ పార్టీ హామీ ఇచ్చింది. ఇందులో భాగంగా రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి 200 యూనిట్లు ఉచిత కరెంటుతోపాటు మహిళలకు నెలకు రూ.2వేలు, బీపీఎల్‌ కుటుంబానికి ఉచితంగా పది కిలోల బియ్యం, నిరుద్యోగులకు రూ.3వేల భృతి, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం వంటి హామీలు కీలకమైనవి. మత్స్యకారులకు ఉచితంగా 500 లీటర్ల డీజీల్‌ వంటివి వీటికి అదనం. ఇలా కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటే ప్రభుత్వానికి ఏటా రూ.62వేల కోట్ల ఖర్చవుతుందని ఎకనామిక్‌ టైమ్స్‌ అంచనా వేసింది.

జీఎస్టీ వసూళ్లలో (పెద్ద రాష్ట్రాల విభాగంలో) కర్ణాటక రికార్డు స్థాయి వృద్ధి కనబరుస్తోంది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి రెవెన్యూ వసూళ్ల లక్ష్యం రూ.72వేల కోట్లు. అయితే, జనవరి నాటికి దీన్ని అధిగమించి మొత్తం రూ.83 వేల కోట్లను వసూలు చేసింది. బడ్జెట్‌ అంచనాల కంటే ఇది 15శాతం అధికం. ఈ నేపథ్యంలో కొత్తగా అధికారం చేపట్టబోయే కాంగ్రెస్‌ పార్టీకి.. ఇచ్చిన హామీలను నెరవేర్చడం పెద్ద కష్టమేమీ కాకపోవచ్చని తెలుస్తోంది. అయినప్పటికీ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 2.5లక్షల ఉద్యోగాలను భర్తీతోపాటు మొత్తంగా పది లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చింది. ఇది కూడా అమలు చేస్తే మాత్రం రాష్ట్ర బడ్జెట్‌పై ప్రభావం చూపించే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని