Karnataka: ఒమిక్రాన్‌ ఎఫెక్ట్‌.. కర్ణాటకలో కొత్త రూల్స్‌!

కరోనా వైరస్‌ ఒమిక్రా వేరియంట్‌ భయాందోళనల నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం అప్రమత్తమైంది.

Published : 27 Nov 2021 21:59 IST

బెంగళూరు: కరోనా వైరస్‌ ఒమిక్రా వేరియంట్‌ భయాందోళనల నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం అప్రమత్తమైంది. ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. దక్షిణాఫ్రికా నుంచి బెంగళూరు వచ్చిన ఇద్దరు ప్రయాణికులకు కరోనా పాజిటివ్‌ రావడంతో అంతర్జాతీయ ప్రయాణికులకు ఎయిర్‌పోర్టుల్లో స్క్రీనింగ్‌ పరీక్షల్ని తప్పనిసరి చేసింది. దక్షిణాఫ్రికా, బోట్స్‌వానా, హాంకాంగ్‌, ఇజ్రాయెల్‌ వంటి దేశాల నుంచి వచ్చిన వారికి కొవిడ్ నెగెటివ్‌ సర్టిఫికెట్‌ ఉన్నప్పటికీ మళ్లీ పరీక్ష నిర్వహించాలని సూచించింది. ఒకవేళ పరీక్షల్లో కొవిడ్ నెగిటివ్‌గా వచ్చినా.. వారం పాటు క్వారంటైన్‌లో ఉండాలని, మళ్లీ నెగిటివ్‌ వచ్చాకే బయటకు వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించింది.

మరోవైపు ధార్వాడ్‌లోని ఎస్‌డీఎం వైద్య కళాశాల ప్రాంగణంలో భారీగా కరోనా కేసులు వెలుగు చూసిన నేపథ్యంలో పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చేవారిపైనా ఆంక్షలకు సిద్ధమైంది. కళాశాలలో ఇప్పటివరకు 281 మంది కరోనా బారినపడిన నేపథ్యంలో మహారాష్ట్ర, కేరళ నుంచి వచ్చే వారికి ఆర్టీ-పీసీఆర్‌ పరీక్షలను తప్పనిసరి చేసింది. అలాగే, ప్రభుత్వ కార్యాలయాల్లోనూ, మాల్స్‌, హోటల్స్, సినిమా హాళ్లు, జూ, స్విమ్మింగ్‌పూల్స్‌ తదితర చోట్ల ప్రవేశాలకు రెండు డోసుల వ్యాక్సిన్‌ తప్పనిసరి చేసింది. స్కూళ్లు, కాలేజీల్లో సాంస్కృతిక కార్యక్రమాలపై తాత్కాలికంగా నిషేధం విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం బవసరాజ్‌ బొమ్మై నేతృత్వంలో శనివారం సాయంత్రం జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని