Khalistan: హిమాచల్‌ అసెంబ్లీ ఆవరణలో ఖలిస్థాన్‌ జెండాల కలకలం.. ఖండించిన సీఎం ఠాకూర్‌

హిమాచల్ ప్రదేశ్ ధర్మశాలలోని రాష్ట్ర శాసనసభ ప్రధాన గేటు, ప్రహరీపై ఖలిస్తాన్‌ జెండాలు ప్రత్యక్షమవడం కలకలం రేపాయి. ఆదివారం తెల్లవారుజామున గేట్లపై ఈ జెండాలు ఉన్నట్లు కాంగ్రా పోలీసులకు సమాచారం అందింది. అసెంబ్లీ కాంప్లెక్స్...

Published : 08 May 2022 14:24 IST

శిమ్లా: హిమాచల్ ప్రదేశ్ ధర్మశాలలోని రాష్ట్ర శాసనసభ ప్రధాన గేటు, ప్రహరీపై ఖలిస్థాన్ జెండాలు ప్రత్యక్షమవడం కలకలం రేపాయి. ఆదివారం తెల్లవారుజామున గేట్లపై ఈ జెండాలు ఉన్నట్లు కాంగ్రా పోలీసులకు సమాచారం అందింది. అసెంబ్లీ కాంప్లెక్స్ గోడలపైనా ఖలిస్థాన్‌ అనుకూల నినాదాలు కనిపించాయి. స్థానిక ఉప కమిషనర్ డా.నిపుణ్‌ జిందాల్ ఈ విషయాన్ని ధ్రువీకరించారు. నిందితులను పట్టుకునేందుకు పోలీసులు సమీప ప్రాంతాల్లోని సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ‘కొందరు అగంతుకులు రాష్ట్ర శాసనసభ వెలుపలి గేటుపై అయిదు నుంచి ఆరు ఖలిస్థాన్‌ జెండాలను ఉంచారు. గోడపై దాని అనుకూల నినాదాలు రాశారు. వాటిని వెంటనే తొలగించాం. ఈ వ్యవహారంపై పోలీసులు గుర్తుతెలియని వ్యక్తులపై కేసు నమోదు చేశారు. దర్యాప్తు కొనసాగుతోంద’ని చెప్పారు. మరోవైపు.. ఇది పంజాబ్‌కు చెందిన కొంతమంది దుండగుల దుశ్చర్యగా కనిపిస్తోందని పోలీసులు తెలిపారు.

మరోవైపు హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్ ఈ ఘటనను ఖండించారు. దీన్ని పిరికిపంద చర్యగా అభివర్ణిస్తూ.. ట్వీట్‌ చేశారు. ‘ఈ అసెంబ్లీలో శీతాకాల సమావేశాలు మాత్రమే జరుగుతాయి. కాబట్టి, ఆ సమయంలోనే మరింత భద్రతా ఉంటుంది. దీన్ని అవకాశంగా తీసుకుని కొంతమంది దుర్మార్గానికి పాల్పడ్డారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకుంటాం. ధైర్యముంటే చీకట్లో కాకుండా పగటిపూట బయటకు రావాలి’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, ఇటువంటి ఘటనలు జరిగే అవకాశం ఉందని ఇటీవలే రాష్ట్రానికి ఇంటెలిజెన్స్‌ నివేదికలు అందినట్లు సమాచారం. ఇటీవల హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం.. భింద్రన్‌వాలే, ఖలిస్థాన్‌ జెండాలను కలిగి ఉన్న వాహనాలను నిషేధించింది. దీనికి ప్రతీకారంగా.. శిమ్లాలో భింద్రన్‌వాలే, ఖలిస్థాన్‌ జెండాలను ఎగురవేస్తామని సిఖ్‌ ఫర్ జస్టిస్(ఎస్‌ఎఫ్‌జే) చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్నూ.. ముఖ్యమంత్రికి హెచ్చరించినట్లు నివేదిక పేర్కొంది. గతంలోనూ మార్చి 29న ఖలిస్థాన్‌ జెండాను ఎగురవేస్తామని ఆ సంస్థ ప్రకటించినప్పటికీ.. భారీ భద్రత కారణంగా కుదరలేదు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని