Khalistan: ఆగని ఖలిస్థానీ అనుకూలవాదుల దాడులు.. నిన్న లండన్‌.. నేడు శాన్‌ఫ్రాన్సిస్కో

ఖలిస్థాన్‌ (Khalistan) సానుభూతిపరులు అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలో ఉన్న భారత్‌ కాన్సులేట్‌ కార్యాలయంపై దాడికి దిగారు. అమృత్‌పాల్‌ సింగ్‌కు అనుకూలంగా నినాదాలు చేశారు.

Published : 20 Mar 2023 20:12 IST

దిల్లీ: ఖలిస్థాన్‌ (Khalistan) అనుకూలవాదులను పంజాబ్‌ పోలీసులు అరెస్టు చేయడంతోపాటు, ‘వారిస్‌ పంజాబ్‌ దే’ నేత అమృత్‌పాల్‌ సింగ్ (Amritpal Singh) కోసం గాలిస్తున్న నేపథ్యంలో విదేశాల్లోని ఖలిస్థానీ సానుభూతిపరులు దుశ్చర్యలకు పాల్పడుతున్నారు. ఆదివారం లండన్‌ (London)లోని భారత్‌ హైకమిషన్‌ భవనంపై ఉన్న జెండాను కిందికి దింపి అగౌరవ పరిచిన ఆందోళనకారులు... తాజాగా అమెరికా (USA)లోని శాన్‌ఫ్రాన్సిస్కో (San Francisco) లోని ఇండియన్‌ కాన్సులేట్‌పై దాడికి దిగారు. పంజాబీ మ్యూజిక్‌ను పెద్దగా మోగించుకుంటూ అమృత్‌పాల్‌కు అనుకూలంగా నినాదాలు చేశారు. అంతేకాకుండా ‘‘ఫ్రీ అమృత్‌పాల్‌’’ అంటూ కాన్సులేట్‌ భవనం గోడలపై పెయింట్‌తో రాశారు. అంతేకాకుండా ఈ దృశ్యాలన్నింటినీ తమ కెమెరాల్లో బంధించి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. అందులో ఆందోళనకారులు భవనంలోని తలుపులు, కిటికీల అద్దాలను ధ్వంసం చేస్తున్న దృశ్యాలు రికార్డయ్యాయి. 

భారత్‌ కాన్సులేట్‌ కార్యాలయం ప్రవేశ ద్వారం వద్ద అతికించిన ఖలిస్థాన్‌ జెండాలను ముగ్గురు వ్యక్తులు (బహుశా కాన్సులేట్‌ ఉద్యోగులు అయిఉండొచ్చు) తొలగిస్తున్నట్లు వీడియోలో ఉంది. అంతలో ఓ గుంపు అకస్మాత్తుగా బారికేడ్లను తొలగించుకుంటూ వారిపై దాడి చేసేందుకు ప్రయత్నించింది. దీంతో ఆ ముగ్గురూ జెండాలు చేతబట్టుకొని కాన్సులేట్‌ కార్యాలయం లోపలికి వెళ్లిపోయారు. దీంతో ఆగ్రహించిన ఆ అల్లరిమూక కాన్సులేట్ కార్యాలయంపై దాడికి దిగింది. కిటికీ అద్దాలు పగలగొడుతూ.. ఖలిస్థాన్‌కు అనుకూలంగా నినాదాలు చేసింది. మరోవైపు కాన్‌బెర్రాలోని అస్ట్రేలియా పార్లమెంట్‌ భవనం ఎదుట పెద్దసంఖ్యలో ఖలిస్థాన్‌ సానుభూతిపరులు గుమిగూడారు. అమృత్‌పాల్‌ సింగ్‌కు, అతడి అనుచరులకు అనుకూలంగా నినాదాలు చేశారు.

మరోవైపు లండన్‌లోని భారత్‌ హైకమిషన్‌ కార్యాలయం దగ్గర ఆదివారం జరిగిన దుశ్చర్యపై భారత్‌ తీవ్రస్థాయిలో మండిపడింది. అంతేకాకుండా ఇవాళ ఉదయం అక్కడ భారీ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన భారత్‌.. దిల్లీలోని బ్రిటన్‌ డిప్యూటీ కమిషనర్‌ క్రిస్టియాన్‌ స్కాట్‌కు సమన్లు జారీ చేసింది. ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని బ్రిటన్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. నిరసనకారులు భారత హైకమిషన్‌కు వచ్చేంత వరకు అక్కడి భద్రతా సిబ్బంది ఏం చేస్తున్నారని ప్రశ్నించింది. దీనిపై  వివరణ ఇవ్వాలని బ్రిటన్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. వియన్నా ఒప్పందం ప్రకారం భారత హైకమిషన్‌కు భద్రత కల్పించడం యూకే ప్రభుత్వ ప్రాథమిక బాధ్యత భారత విదేశాంగశాఖ గుర్తు చేసింది. భారత దౌత్య కార్యాలయ ప్రాంగణం, అక్కడి సిబ్బంది భద్రత పట్ల యూకే ప్రభుత్వ ఉదాసీనత ఆమోదయోగ్యం కాదని తెలిపింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు