Congress: రాష్ట్రపతి ప్రసంగానికి కాంగ్రెస్‌ ఎంపీలు దూరం.. మంచు కారణమట..!

మంగళవారం పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసంగిస్తారు. దీనికి కాంగ్రెస్(Congress) ఎంపీలు దూరం కానున్నారు. 

Published : 31 Jan 2023 10:41 IST

(ప్రతీకాత్మక చిత్రం)

దిల్లీ: కొత్త ఆర్థిక సంవత్సరం కోసం కేంద్రప్రభుత్వం(Center) ఫిబ్రవరి 1న బడ్జెట్‌ ప్రవేశపెట్టనుంది. దీంతో మంగళవారం నుంచి పార్లమెంట్‌(Parliament) బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. సెంట్రల్‌ హాల్‌లో ఉభయసభల సభ్యులను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసంగించనున్నారు. దీనికి కాంగ్రెస్ ఎంపీలు దూరం కానున్నారు. రాజ్యసభ సభాపక్ష నేత మల్లికార్జున ఖర్గే, పలువురు ఎంపీలు హాజరుకారని ఆ పార్టీ నేత జైరాం రమేశ్‌ వెల్లడించారు.

సోమవారం శ్రీనగర్‌లో జరిగిన భారత్‌ జోడో యాత్ర ముగింపు సభలో పాల్గొన్నారు. అయితే, ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయని, దాంతో ఖర్గేతో సహా పలువురు ఎంపీలు రాష్ట్రపతి ప్రసంగానికి హాజరుకాలేకపోతున్నారని ఆయన వెల్లడించారు. అయితే, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హాజరు పై స్పష్టత లేదు. సోనియా గాంధీ మాత్రం హాజరుకానున్నారు. ఇదిలా ఉంటే.. భాజపా సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వ విధానాలకు నిరసనగా పార్లమెంటులో రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించాలని భారత్‌ రాష్ట్ర సమితి(BRS), ఆమ్‌ఆద్మీ పార్టీ(AAP)లు నిర్ణయించాయి.

గత ఏడాది జులై 25న రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ద్రౌపదీముర్ము లోక్‌సభ, రాజ్యసభల సంయుక్త సమావేశంలో ప్రసంగించడం ఇదే తొలిసారి. రాష్ట్రపతి ప్రసంగం పూర్తికాగానే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌ ఆర్థిక సర్వేను సభ ముందు ఉంచనున్నారు. బుధవారం ఉదయం 11 గంటలకు ఆమె దిగువ సభలో 2023-24 బడ్జెట్‌ను ప్రవేశపెడతారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని