Khushbu Sundar: రాహుల్‌కు జైలుశిక్ష.. వైరల్‌ అవుతున్న ఖుష్బూ పాత ట్వీట్‌

భాజపా నాయకురాలు ఖుష్బూ సుందర్‌ (Khushbu Sundar) కూడా గతంలో ప్రధాని మోదీ పేరును కించపర్చేలా మాట్లాడిందని, ఆమెపై ఇప్పుడు కేసు పెడతారా? అని కాంగ్రెస్‌ మద్దతుదారులు ప్రశ్నిస్తున్నారు. ఆమె చేసిన పాత ట్వీట్‌ ఇప్పుడు వైరల్‌ అవుతోంది.

Updated : 25 Mar 2023 20:17 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రధాని మోదీ (Modi) ఇంటిపేరును కించపర్చారన్న అభియోగాలపై కాంగ్రెస్‌ (Congress) అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi)కి జైలు శిక్ష పడటం, ఆ తర్వాత ఆయన లోక్‌సభ సభ్యత్వం (Disqualification) రద్దవడం దేశ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపింది. ఈ పరిణామాలతో కేంద్రంపై విపక్షాలు భగ్గుమంటున్న వేళ.. భాజపా (BJP) నాయకురాలు ఖుష్బూ సుందర్‌ (Khushbu Sundar) గతంలో చేసిన ఓ ట్వీట్‌ ఇప్పుడు వైరల్‌ అవుతోంది. అందులో ఖుష్బూ.. ప్రధానిపై ఘాటు విమర్శలు చేశారు.

2018లో ఖుష్బూ (Khushbu Sundar) కాంగ్రెస్‌ అధికార ప్రతినిధిగా ఉన్న సమయంలో మోదీ సర్కారుపై విమర్శలు గుప్పిస్తూ ఓ ట్వీట్‌ చేశారు. నీరవ్‌ మోదీ, లలిత్‌ మోదీ కుంభకోణాలను ప్రస్తావించిన ఆమె.. ‘‘మోదీ (Modi) అంటే అర్థం అవినీతి అని మార్చాలి. అది సరిగ్గా సరిపోతుంది’’ అంటూ విరుచుకుపడ్డారు. రాహుల్‌ (Rahul Gandhi) కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేసినందుకే ఆయనకు సూరత్‌ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ నేపథ్యంలోనే ప్రజాప్రాతినిధ్య చట్టం కింద ఆయనపై అనర్హత వేటు పడింది.

దీంతో కాంగ్రెస్‌ మద్దతుదారులు ఇప్పుడు ఖుష్బూ పాత ట్వీట్‌ను వైరల్‌ చేస్తూ మోదీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఆమెపై కూడా కేసు పెడతారా అంటూ భాజపాను ప్రశ్నిస్తున్నారు. 2020లో ఖుష్బూ కాంగ్రెస్‌ను వీడి భాజపాలో చేరిన విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం ప్రతిపక్ష నేతలపై ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతోందని ఇప్పటికే విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. భాజపాలో చేరిన తర్వాత నేతలపై కేసులు మాయమవుతున్నాయని దుయ్యబడుతున్నాయి. ఈ క్రమంలో ఖుష్బూ ట్వీట్ ప్రాధాన్యత సంతరించుకుంది.

2019లో ఓ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాహుల్ (Rahul Gandhi).. ‘దొంగలందరికీ మోదీ అనే ఇంటిపేరే ఎందుకు ఉంటుందో?’ అని వ్యాఖ్యలు చేశారు. దీనిపై గుజరాత్‌కు చెందిన భాజపా నేత పూర్నేశ్‌ మోదీ పరువు నష్టం కేసు దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన సూరత్‌ న్యాయస్థానం.. రాహుల్‌కు రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ గురువారం తీర్పు వెలువరించింది. ఈ తీర్పు వచ్చిన 24 గంటల్లోగా రాహుల్‌పై అనర్హత వేటు వేస్తూ లోక్‌సభ సెక్రటేరియట్‌ నిన్న నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే.

పాత ట్వీట్‌పై స్పందించిన ఖుష్బూ

గతంలో ప్రధాని నరేంద్ర మోదీని విమర్శిస్తూ తాను చేసిన ట్వీట్‌పై ఖుష్బూ స్పందించారు. పార్టీ ఆదేశాల మేరకే తాను అలా స్పందించానని, అప్పటి పార్టీ అధినేత వైఖరినే అనుసరించినట్లు చెప్పారు. ‘ఆ సమయంలో నేను కాంగ్రెస్‌లో ఉన్నా. పార్టీ అధికార ప్రతినిధిగా నా కర్తవ్యాన్ని నిర్వర్తించా. మేం అలాగే మాట్లాడాలి. నేనూ అదే చేశా. అభిప్రాయాల వ్యక్తీకరణ విషయంలో పార్టీ అధినేతను అనుసరించా’ అని వివరించారు. తన ట్విటర్‌ ఖాతాలో ఇప్పటివరకు ఏ ట్వీట్‌నూ తొలగించలేదని, ఆ పోస్టునూ కూడా తొలగించనని స్పష్టం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని