బైడెన్‌ ఎన్నిక.. కిమ్‌ కీలక నిర్ణయం!

ఓ వైపు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్‌ అభ్యర్థి జో బైడెన్‌ విజయాన్ని అమెరికా కాంగ్రెస్‌ ధ్రువీకరించిన రోజునే.. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. దేశ సైనిక సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేస్తానని ప్రతిజ్ఞ చేశారు.ఈ మేరకు  పార్టీ కీలక నేతలతో నిర్వహించిన....

Published : 07 Jan 2021 18:11 IST

ప్యాంగాంగ్‌: ఓ వైపు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్‌ అభ్యర్థి జో బైడెన్‌ విజయాన్ని అమెరికా కాంగ్రెస్‌ ధ్రువీకరించిన రోజునే.. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. దేశ సైనిక సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేస్తానని ప్రతిజ్ఞ చేశారు.ఈ మేరకు  పార్టీ కీలక నేతలతో నిర్వహించిన భేటీలో ఈ విషయాన్ని ప్రకటించారు. అమెరికా- ఉత్తర కొరియా అణు ఒప్పందంపై ప్రతిష్టంభన ఏర్పడిన నేపథ్యంలో కిమ్‌ వ్యాఖ్యలకు ప్రాధాన్యత ఏర్పడింది. ‘‘ దేశ రక్షణ సంబంధిత వ్యవహారంలో సైనిక సామర్థ్యాలు పటిష్ఠంగా ఉండాలి. దీనికోసం మనం మరింత కృషి చేయాలి’’ అని కిమ్‌ చెప్పినట్లు అక్కడి మీడియా వెల్లడించింది.

అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్‌ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఉత్తర కొరియాతో అణు ఒప్పందంపై చర్చలతో ముందుకెళ్లారు. అయితే ఇరుదేశాల మధ్య పొత్తులు కుదరకపోవడంతో 2019లో అమెరికా, ఉత్తరకొరియా మధ్య అణ్వాయుధ అంశంపై జరిగిన చర్చలు విఫలమైయ్యాయి. మరోవైపు ఇటీవల జరిగిన అమెరికా ఎన్నికల ప్రచారంలో నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన బైడెన్‌.. కిమ్‌ జోంగ్‌ ఉన్‌ను ‘దుండగుడు’గా పేర్కొన్నారు. దీనిని బట్టి బైడెన్‌కు కిమ్‌పై వ్యతిరేక దృక్పథం ఉందని చెప్పుకోవచ్చు. అధ్యక్షుడిగా పూర్తి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇది మరింత ఎక్కువైనా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఈ నేపథ్యంలోనే ఉత్తర కొరియా తన సైనికబలాన్ని బలోపేతం చేసుకునే దిశగా అడుగులు వేస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ఏ చిన్న గొడవ వచ్చినా అణుయుద్ధానికి దిగుతామని హెచ్చరించే కిమ్‌.. బైడెన్‌ అధ్యక్షుడిగా ఎన్నికైనప్పటి నుంచి ఆ పదాన్నే వాడలేదట. ఎందుకంటే ట్రంప్‌లా కాకుండా  బైడెన్‌ చాలా కఠినంగా వ్యవహరిస్తారనే ఉద్దేశంతోనే మౌనంగా ఉంటున్నట్లు కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.

మొదట్లో ట్రంప్‌ కూడా అంతే..

ట్రంప్‌ అధ్యక్ష పదవి చేపట్టిన కొత్తలో ఉత్తర కొరియా మీద కారాలు మిరియాలు నూరిన విషయం విదితమే. ఆ దేశానికి బుద్ధి చెప్పడానికి యుద్ధనౌకలను పంపిస్తున్నాననీ ప్రకటించారు. ఉత్తర కొరియాపై అమెరికా, ఐక్యరాజ్య సమితి ఆంక్షలు విధించాయి కూడా. కిమ్‌ వీటిని ఖాతరు చేయకుండా ఏప్రిల్‌ 29న క్షిపణి పరీక్ష నిర్వహించగా అది విఫలమైంది. మొదట్లో ఉత్తర కొరియాపై సైనిక చర్యకు సిద్ధపడిన ట్రంప్‌.. తరవాత మెత్తబడ్డారు. పరిస్థితులు కలిసొస్తే.. కిమ్‌ జోంగ్‌ ఉన్‌తో సమావేశమవడానికి అభ్యంతరం లేదని, ఆయన్ను కలవడం గౌరవంగా భావిస్తానని ట్రంప్‌ అన్నారు. అందుకు ఉత్తర కొరియా ప్రభుత్వ ప్రతినిధులు సానుకూలంగా స్పందించారు. అంతలోనే మే 14న కిమ్‌ మరో క్షిపణి పరీక్ష జరిపి అమెరికా, దక్షిణ కొరియా, జపాన్‌లకు చిర్రెత్తించారు. ఉత్తర కొరియాపై మరింత తీవ్ర ఆంక్షలు విధించాలని ప్రపంచ దేశాలకు అమెరికా పిలుపు ఇచ్చింది. ఈ నేపథ్యంలో అమెరికా- ఉత్తరకొరియా మధ్య అణు చర్యలు రద్దయ్యాయి. తాజాగా మరికొన్ని రోజుల్లో బైడెన్ బాధ్యతలు చేపట్టనున్న నేపథ్యంలో మళ్లీ కిమ్‌ జోంగ్‌ ఉన్‌ ఉత్తర కొరియా సైనిక శక్తిని బలోపేతం చేస్తామని ప్రకటించడం గమనార్హం.

ఇవీ చదవండి

బైడెన్‌కు అధికారాన్ని అప్పగిస్తా: ట్రంప్‌

సారీ ప్రెసిడెంట్‌.. అలా చేయలేకపోయా...

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని