Lakhimpur violence: లఖింపుర్‌ హింసాకాండ.. ఆశిష్‌ మిశ్ర బెయిల్‌ రద్దు

ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖింపుర్‌ ఖేరీ హింస కేసులో నిందితుడైన కేంద్ర మంత్రి అజయ్‌ మిశ్ర కుమారుడు ఆశిష్‌ మిశ్రకు సుప్రీంకోర్టు గట్టి షాకిచ్చింది. ఈ కేసులో ఆశిష్‌ మిశ్రకు ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేసింది. అతడు

Published : 18 Apr 2022 11:11 IST

దిల్లీ: ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖింపుర్‌ ఖేరీ హింస కేసులో నిందితుడైన కేంద్ర మంత్రి అజయ్‌ మిశ్ర కుమారుడు ఆశిష్‌ మిశ్రకు సుప్రీంకోర్టు గట్టి షాకిచ్చింది. ఈ కేసులో ఆశిష్‌ మిశ్రకు ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేసింది. అతడు వారం రోజుల్లోగా పోలీసులకు లొంగిపోవాలని ఆదేశించింది. ఈ మేరకు సర్వోన్నత న్యాయస్థానం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. 

లఖింపుర్‌ ఖేరీ హింసాత్మక ఘటనలో ప్రధాన నిందితుడిగా ఉన్న ఆశిష్‌ మిశ్రకు అలహాబాద్‌ హైకోర్టు ఫిబ్రవరి 10న బెయిల్‌ మంజూరు చేసింది. దీన్ని సవాల్‌ చేస్తూ బాధిత కుటుంబాల సభ్యులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్‌ ఎన్‌.వి. రమణ నేతృత్వంలోని ధర్మాసనం.. కొన్ని ప్రశ్నలు లేవనెత్తింది. కేసు విచారణ ప్రారంభం కాకముందే.. పోస్టుమార్టం నివేదిక, గాయాల గురించి బెయిల్‌ ఉత్తర్వుల్లో హైకోర్టు ప్రస్తావించటాన్ని తప్పుపట్టింది. అసంబద్ధ విశ్లేషణలతో హైకోర్టు బెయిల్‌ ఇచ్చిందని అసహనం వ్యక్తం చేసింది. 

దీనిపై గతంలో తీర్పును రిజర్వ్‌లో పెట్టిన న్యాయస్థానం.. హైకోర్టు ఇచ్చిన తీర్పును పక్కనబెట్టింది. ఆశిష్‌కు బెయిల్‌ రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అతడు వారం రోజుల్లో జైలుకు రావాలని ఆదేశించింది. ఈ కేసులో ఆశిష్‌ బెయిల్‌ దరఖాస్తుపై అలహాబాద్‌ హైకోర్టు మళ్లీ కొత్తగా విచారణ చేపట్టాలని సూచించింది.

గతేడాది అక్టోబరులో లఖింపుర్‌ ఖేరీలో ఆందోళన చేస్తోన్న రైతులపైకి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్‌ మిశ్ర కుమారుడు ఆశిష్‌ మిశ్ర కారు దూసుకెళ్లిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో నలుగురు రైతులు మరణించగా.. అనంతరం జరిగిన అల్లర్లలో మరో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. దీనిపై గతంలో విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. కేసు దర్యాప్తునకు సిట్‌ను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఈ దర్యాప్తును రిటైర్డ్‌ న్యాయమూర్తి పర్యవేక్షిస్తారని స్పష్టం చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని