విషమంగానే లాలూ.. ఎయిమ్స్‌కు తరలింపు!

దాణా కుంభకోణంలో జైలు శిక్ష అనుభవిస్తున్న రాష్ట్రీయ జనతాదళ్‌ అధినేత, బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్‌ యాదవ్ ఆరోగ్యం మరింత క్షీణించింది. దీంతో శనివారం సాయంత్రం ఆయనను దిల్లీలోని

Published : 23 Jan 2021 15:12 IST

రాంచీ/దిల్లీ: దాణా కుంభకోణంలో జైలు శిక్ష అనుభవిస్తున్న రాష్ట్రీయ జనతాదళ్‌ అధినేత, బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్‌ యాదవ్ ఆరోగ్యం మరింత క్షీణించింది. దీంతో శనివారం సాయంత్రం ఆయనను దిల్లీలోని ఎయిమ్స్‌కు తరలించనున్నట్లు రాంచీ ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. 

దాణా కుంభకోణంలో దోషిగా తేలడంతో 2017 డిసెంబరు నుంచి రాంచీ జైలులో శిక్ష అనుభవిస్తున్న లాలూ.. చాలా కాలంగా పలు రకాల వ్యాధులతో బాధపడుతున్నారు. అయితే ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్‌ సోకడంతో గురువారం ఆయన ఆరోగ్యం ఆందోళనకరంగా మారింది. దీంతో వెంటనే ఆయనను రిమ్స్‌ ఆసుపత్రికి తరలించిన జైలు అధికారులు.. లాలూ కుటుంబసభ్యులకు సమాచారమిచ్చారు. 

ఆసుపత్రిలో లాలూకు కొవిడ్‌ పరీక్ష జరపగా.. నెగెటివ్‌ వచ్చినట్లు వైద్యులు తెలిపారు. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉండటంతో దిల్లీలోని ఎయిమ్స్‌ ఆసుపత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. లాలూను దిల్లీకి తీసుకెళ్లాలంటే జైలు అధికారులు స్థానిక కోర్టు నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఆ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఆయనను ఎయిమ్స్‌కు తరలించే అవకాశముంది. ఇప్పటికే లాలూ భార్య రబ్రీదేవి, కుమార్తె మీసా భారతి, కుమారుడు తేజస్వీ యాదవ్‌ రాంచీ చేరుకున్నారు. తన తండ్రికి మెరుగైన చికిత్స అందించాలని ఝార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ను కోరినట్లు తేజస్వీ తెలిపారు. 

ఇదీ చదవండి..

స్థిరంగా శశికళ ఆరోగ్యం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని