Rohini Acharya: నా తండ్రికి ఏదైనా జరిగితే.. ఎవర్నీ వదలను..!

మంగళవారం బిహార్‌ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్‌ను సీబీఐ(CBI) ప్రశ్నించింది. దీనిపై ఆయన కుమార్తె స్పందించారు. 

Published : 07 Mar 2023 17:57 IST

పట్నా: రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో ఉద్యోగాలు ఇప్పించేందుకు కొంతమంది అభ్యర్థుల నుంచి భూములు తీసుకున్నారన్న అభియోగాలపై నమోదైన కేసు (Land For Job Case)లో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్(Lalu Prasad Yadav) సీబీఐ(CBI) విచారణను ఎదుర్కొంటున్నారు. మంగళవారం దర్యాప్తు సంస్థ ఆయన్ను ప్రశ్నించింది. దీనిపై లాలూ కుమార్తె రోహిణీ ఆచార్య ట్విటర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. తన తండ్రిని నిరంతరం వేధిస్తున్నారని, ఆయనకు ఏదైనా జరిగితే ఎవర్నీ వదలనని హెచ్చరించారు. ఈ మేరకు వరుస ట్వీట్లు చేశారు.

‘తన తండ్రిని వేధిస్తోన్న తీరు సరికాదు. ఇవన్నీ గుర్తుంటాయి. సమయం అన్నింటికంటే శక్తివంతమైంది. ఆయనకు దిల్లీలోని పీఠాన్ని కదిలించే శక్తి ఇప్పటికీ ఉంది’ అని అన్నారు. అలాగే సహనానికి కూడా హద్దు ఉంటుందని, దాన్ని కూడా పరీక్షిస్తున్నారంటూ మండిపడ్డారు.

2004 నుంచి 2009 వరకు కేంద్రంలో యూపీఏ(UPA)హయాంలో లాలూ( Lalu Prasad Yadav) రైల్వే మంత్రిగా ఉన్నారు. ఈ క్రమంలోనే 2008-09 మధ్య రైల్వే ఉద్యోగాలకు నియామక ప్రక్రియ జరగ్గా.. కొందరు అభ్యర్థులకు ఉద్యోగాలు ఇచ్చేందుకు వారి నుంచి లాలూ కుటుంబం భూములు, ఇతర ఆస్తులను లంచంగా తీసుకున్నట్లు వచ్చిన ఆరోపణలపై గతంలో సీబీఐ కేసు నమోదుచేసింది. దానిపై లాలూ, ఆయన సతీమణి రబ్రీదేవిని రెండు రోజులు సీబీఐ విచారించింది. 

ఇదిలా ఉంటే.. సింగపూర్‌లో విజయవంతంగా కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స అనంతరం లాలూ ప్రసాద్‌ ఇటీవలే స్వదేశానికి తిరిగొచ్చారు.  రోహిణినే ఆయనకు కిడ్నీ దానం చేశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని