‘రా’ఏజెంట్‌ను.. ఇప్పుడే మేడమ్‌కు రిపోర్టు చేశా..! 

దర్భంగా రైల్వేస్టేషన్‌ పేలుళ్ల కేసులో ఆసక్తికర విషయాలు బయటకు వస్తున్నాయి. ఈ కేసులో అరెస్టయిన నలుగురు ఉగ్రవాదుల్లో ఒకరైన మహమ్మద్‌ నాసర్‌ ఖాన్‌ ఇంట్లో వారికి కూడా మస్కాకొట్టాడు.

Updated : 04 Jul 2021 12:00 IST

* ఇంట్లో దేశ నిఘా ఏజెంటుగా.. బయట ఉగ్రకలాపాలు..!
* దర్భంగా కేసులో దిమ్మతిరిగే నిజాలు

ఇంటర్నెట్‌డెస్క్‌: దర్భంగా రైల్వేస్టేషన్‌ పేలుళ్ల కేసులో ఆసక్తికర విషయాలు బయటకు వస్తున్నాయి. ఈ కేసులో అరెస్టయిన నలుగురు ఉగ్రవాదుల్లో ఒకరైన మహమ్మద్‌ నాసర్‌ ఖాన్‌ తన ఇంట్లో వారికి కూడా మస్కాకొట్టాడు. ఇందుకోసం రీసెర్చ్‌ అండ్‌ అనాలసిస్‌ వింగ్‌ పేరు వాడుకొన్నాడు. తాను ‘రా’లో ఒక మహిళా అధికారి కింద పనిచేస్తున్నట్లు నమ్మించాడు. దీంతో అసలు విషయం తెలియని కుటుంబ సభ్యులు నిజమేనని నమ్మారు. చివరికి అతడి అరెస్టుతో నిజం బయటకు వచ్చింది.

జూన్‌ 17న బిహార్‌లో చోటుచేసుకున్న దర్భంగా పేలుళ్ల కేసులో ఇటీవల హైదరాబాద్‌ ఆసిఫ్‌నగర్‌లోని అన్నాదమ్ములు ఇమ్రాన్‌ఖాన్‌, నాసిర్‌ ఖాన్‌లను ఎన్‌ఐఏ అధికారులు అరెస్టు చేశారు. వీరి అరెస్టుతో ఆ కుటుంబ సభ్యులు షాక్‌కు గురయ్యారు. అప్పటి వరకూ నాసిర్‌  భారత నిఘా సంస్థ రీసెర్చ్‌ అండ్‌ అనాలసిస్‌ వింగ్‌లో దేశం కోసం పనిచేస్తున్నాడని నమ్మారు. కొన్నేళ్ల నుంచి కుటుంబ సభ్యులను ఇలానే నమ్మిస్తూ వచ్చాడు. 2012లో ఓ బంధువును కలుసుకోవడం కోసం అంటూ అధికారిక పత్రాలతో  నాసిర్‌ పాకిస్థాన్‌ సందర్శించాడు. ఆ సమయంలో తనకు ‘రా’ కొత్త పని అప్పజెప్పిందని భార్యను, మాజీ సైనికుడైన తండ్రిని నమ్మించాడు.

ఆ తర్వాత అనధికారికంగా వేర్వేరు మార్గాల్లో పాకిస్థాన్‌కు రెండుమూడు సార్లు  వెళ్లివచ్చాడు. ఒక సారి నాలుగు నెలలపాటు అక్కడే ఉండి పాక్‌-అఫ్గానిస్థాన్‌ సరిహద్దుల్లో లష్కరే వద్ద శిక్షణ పొందాడు. టైమర్‌ పరికరాలు వాడటం, ఐఈడీ పేలుళ్లు జరపడం వంటి వాటిల్లో నాసిర్‌ సిద్ధహస్తుడు.

తరచూ అర్ధరాత్రి గంటల తరబడి ఫోన్లలో మాట్లాడేవాడు. ఈ క్రమంలో ఒక రోజు సుదీర్ఘంగా ఫోన్‌లో మాట్లాడటంతో అతని భార్య గొడవపడింది. అమెను నమ్మించేందుకు ‘రా’లో తన పై అధికారిణికి రిపోర్ట్‌ చేయడంతోపాటు సూచనలు తీసుకొంటునన్నాని అబద్ధమాడాడు. ఆ అధికారిణి దేశంలోనే అత్యున్నత నిఘా సంస్థలో పెద్ద  హోదాలో ఉందని చెప్పాడు. ఈ విషయాలు మొత్తం జాతీయ దర్యాప్తు సంస్థ విచారణలో బయటకు వచ్చాయి.  

ఈ అబద్ధాలను అతడి కుటుంబ సభ్యులు ఎంతగా నమ్మారంటే..  నాసిర్‌ని పోలీసులు అదుపులోకి తీసుకొన్న సమయంలో కూడా అతని తండ్రి మీడియాతో మాట్లాడుతూ తన బిడ్డ భారత గూఢచారి అని చెప్పాడు. పలు భద్రతా సంస్థలు 12 రోజులు పాటు ఈ సోదరులను ప్రశ్నించిన తర్వాత బుధవారం అరెస్టు చేశాయి. ఆ తర్వాత ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఖైరానలో మరో ఇద్దరిని అరెస్టు చేశారు.

కేసు పూర్వపరాలు ఏమిటీ..

ఈ నెల 17న బిహార్‌లోని దర్భంగా రైల్వే స్టేషన్‌లో పార్సిళ్లు దింపుతుండగా పేలుడు సంభవించింది. దుస్తుల మధ్యలో ఉంచిన చిన్న సీసా నుంచి తొలుత పొగలు వచ్చి తర్వాత పేలుడు జరిగింది. తదుపరి దర్యాప్తులో ఆ పార్సిల్‌ సికింద్రాబాద్‌లో బుక్‌ చేసినట్లు గుర్తించి ఇక్కడి నుంచి దర్యాప్తు మొదలుపెట్టారు. ఇందులో ఉగ్రకుట్ర ఉన్నట్లు ప్రాథమిక ఆధారాలు లభించడంతో దిల్లీ ఎన్‌ఐఏకు కేసు బదిలీ చేశారు. తెలంగాణ పోలీసులు, బిహార్‌, యూపీ యాంటీ టెర్రరిస్ట్‌ స్క్వాడ్‌ (ఏటీఎస్‌) సిబ్బంది వీరికి సహకరిస్తున్నారు. విచారణలో భాగంగా హైదరాబాద్‌లో జూన్‌ 15న మహ్మద్‌ సుఫియాన్‌ అనే పేరుతో పార్సిల్‌ బుక్‌ చేసినట్లు తెలిసింది. దీనికి రెండు రోజుల క్రితమే ఉత్తర్‌ప్రదేశ్‌ ఏటీఎస్‌ పోలీసులు శామిలీ జిల్లాలోని ఖైరానా అనే ఊర్లో మహ్మద్‌ హజీ సలీమ్‌ ఖాసీం, మహ్మద్‌ కాఫిల్‌ అనే తండ్రీకొడుకులను అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్‌ ఆసిఫ్‌నగర్‌లో ఇమ్రాన్‌, నాసిర్‌లను అదుపులోకి తీసుకున్న ఎన్‌ఐఏ అధికారులు విచారణ కోసం దిల్లీ తీసుకెళ్లారు. వీరిద్దరూ ఉత్తరప్రదేశ్‌కు చెందిన వారేనని, చాలాకాలంగా హైదరాబాద్‌లోని ఆసిఫ్‌నగర్‌లో అద్దెకు ఉంటూ రెడీమేడ్‌ దుస్తులు విక్రయిస్తున్నారని తేలింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని