మహారాష్ట్రలోని అమరావతిలో లాక్‌డౌన్‌!

అమరావతి జిల్లాలో వారంపాటు పూర్తి లాక్‌డౌన్ విధిస్తున్నట్లు మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

Published : 21 Feb 2021 19:07 IST

వారంపాటు అమలు- మహారాష్ట్ర సర్కార్‌

ముంబయి: మహారాష్ట్రలో కరోనా వైరస్‌ తీవ్రత క్రమంగా పెరుగుతోంది. దీంతో అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం తీవ్రత ఉన్నచోట్ల ఇప్పటికే కర్ఫ్యూ వంటి ఆంక్షలు విధిస్తోంది. ఈ నేపథ్యంలో అమరావతి జిల్లాతో పాటు పలు జిల్లాల్లో వారంపాటు పూర్తి లాక్‌డౌన్ విధిస్తున్నట్లు మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఫిబ్రవరి 22 రాత్రి నుంచి మార్చి 1వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని వెల్లడించింది. ఇప్పటికే అమరావతి ప్రాంతంలో వారాంతం లాక్‌డౌన్‌ అమలులో ఉండగా, వైరస్‌ వ్యాప్తి అదుపులోకి రాకపోవడంతో పూర్తి లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

వైరస్‌ ప్రభావం అధికంగా ఉన్న నేపథ్యంలో అమరావతి జిల్లాలో వారంపాటు పూర్తి లాక్‌డౌన్‌ అమలులో ఉంటుందని మహారాష్ట్ర మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి యశోమతి ఠాకూర్‌ వెల్లడించారు. ఈ సమయంలో అత్యవసర సేవలకు మాత్రం అనుమతి ఉంటుందని పేర్కొన్నారు. అమరావతి డివిజన్‌లోని అకోలా, యావత్‌మల్‌, బుల్ధానా, వాషిం నాలుగు జిల్లాల్లోనూ పలు ఆంక్షలు కొనసాగుతాయని చెప్పారు. ప్రజలు కొవిడ్‌ నిబంధనలు పాటించకుంటే లాక్‌డౌన్‌ పొడగించే అవకాశాలు కూడా ఉన్నాయని హెచ్చరించారు.

రాష్ట్రవ్యాప్తంగా కరోనా తీవ్రత పెరుగుతోన్న నేపథ్యంలో ఇప్పటికే అప్రమత్తమైన మహారాష్ట్ర ప్రభుత్వం, వైరస్‌ కట్టడి చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులకు సూచించింది. పరిస్థితి తీవ్రతను బట్టి లాక్‌డౌన్‌, కర్ఫ్యూలపై ఆయా జిల్లాల కలెక్టర్లు నిర్ణయం తీసుకోవాలని పేర్కొంది. ఇందులో భాగంగా ఇప్పటికే పుణెలో రాత్రిపూట కర్ఫ్యూ అమలు చేస్తున్నట్లు జిల్లా అధికారులు ప్రకటించారు. మహారాష్ట్రలో నిన్న ఒక్కరోజే 6281 పాజిటివ్‌ కేసులు నమోదుకాగా వీటిలో 1700 (27శాతం) కేవలం ముంబయి, అమరావతి మునిసిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోనే ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేసేందుకు అమరావతి ప్రాంతంలో లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని