దిల్లీ ప్రభుత్వం అంటే లెఫ్టినెంట్‌ గవర్నరే!

దేశ రాజధాని దిల్లీలో అధికారంలో ఉన్న ఆప్‌ ప్రభుత్వానికి షాక్‌. ‘దిల్లీ ప్రభుత్వం’ అంటే ఇకపై ‘లెఫ్టినెంట్‌ గవర్నర్‌’ అని నిర్వచించే కీలక బిల్లుకు లోక్‌సభ ఆమోదం.......

Published : 23 Mar 2021 01:28 IST

కీలక బిల్లుకు లోక్‌సభ ఆమోదం

దిల్లీ: దేశ రాజధాని దిల్లీలో అధికారంలో ఉన్న ఆప్‌ ప్రభుత్వానికి షాక్‌. ‘దిల్లీ ప్రభుత్వం’ అంటే ఇకపై ‘లెఫ్టినెంట్‌ గవర్నర్‌’ అని నిర్వచించే కీలక బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. ఆమ్‌ఆద్మీ, కాంగ్రెస్‌ పార్టీ సభ్యుల ఆందోళన మధ్య ‘ది గవర్న్‌మెంట్‌ ఆఫ్‌ నేషనల్‌ కేపిటల్‌ టెరిటరీ ఆఫ్‌ దిల్లీ (సవరణ) బిల్లు 2021’కు లోక్‌సభ సోమవారం ఆమోదం తెలిపింది. పాలనా వ్యవహారాల్లో నెలకొన్న అస్పష్టతను చెరిపేసేందుకు ఈ బిల్లును తెచ్చామని భాజపా చెబుతుండగా.. ఇది పూర్తిగా రాజ్యాంగ వ్యతిరేకమని విపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి.

బిల్లుపై లోక్‌సభలో చర్చ సందర్భంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. దీన్ని రాజకీయ బిల్లుగా పరిగణించొద్దని సభ్యులకు సూచించారు. కేంద్రపాలిత ప్రాంతమైన దిల్లీలో పాలన విషయంలో ఇప్పటి వరకు ఉన్న అస్పష్టతను సరిచేసేందుకు, గందరగోళాన్ని లేదా సాంకేతికంగా ఉన్న అవరోధాలను అధిగమించేందుకు ఈ బిల్లును తీసుకొచ్చినట్లు వివరించారు. దీనివల్ల దిల్లీలో పాలనా సామర్థ్యం పెరుగుతుందని చెప్పారు. ఏళ్లుగా కేంద్రానికి, దిల్లీకి మధ్య ఉన్న స్నేహపూర్వక సంబంధాలు 2015 నుంచి దెబ్బతిన్నాయని, కొన్ని అంశాలు దిల్లీ హైకోర్టు ముందుకెళ్లాయని గుర్తుచేశారు. తామెవరి అధికారాలూ హరించడం లేదని, అలాగే లెఫ్టినెంట్‌ గవర్నర్‌కు కూడా కొత్తగా ఎలాంటి అధికారాలూ కట్టబెట్టడం లేదని వివరించారు. లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కూడా పాలనాధికారేనని, ప్రభుత్వ రోజువారీ వ్యవహారాల్లో ఆయనకు జోక్యం చేసుకునే హక్కు ఉంటుందని చెప్పారు.

దిల్లీ ప్రభుత్వం అంటే లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అని ఈ బిల్లు నిర్వచిస్తోంది. దిల్లీ ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ఏదైనా లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అభిప్రాయం తీసుకోవాలని స్పష్టంచేస్తోంది. ఈ బిల్లు ద్వారా తమ అధికారాలను హరిస్తున్నారని, దీన్ని వెనక్కి తీసుకోవాలని ఆమ్‌ ఆద్మీ పార్టీ డిమాండ్‌ చేస్తోంది.  బిల్లుపై చర్చ సందర్భంలోనూ ఆ పార్టీ సభ్యుడు భగవంత్‌మాన్‌ ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించారు. బిల్లును వెనక్కి తీసుకోవాలని కోరారు. కాంగ్రెస్‌ సభ్యుడు మనీశ్‌ తివారీ సైతం బిల్లును వ్యతిరేకించారు. దిల్లీ ప్రభుత్వ అధికారాలను హరించేదిగా ఉన్న ఈ బిల్లును రాజ్యాంగ విరుద్ధంగా అభివర్ణించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని