Lokayukta Trap: కర్ణాటక లంచం కేసు.. భాజపా MLA ఏ1..?

లంచం కేసులో కర్ణాటక (Karnataka) భాజపా ఎమ్మెల్యే కుమారుడితో సహా ఐదుగురిని అరెస్టు చేశామని ఆ రాష్ట్ర లోకాయుక్త (Lokayukta) ప్రకటించింది. దీనిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి.. ఎమ్మెల్యే పాత్రపైనా పూర్తిస్థాయి దర్యాప్తు జరుపుతున్నామని తెలిపింది.

Published : 03 Mar 2023 20:01 IST

బెంగళూరు: కర్ణాటకలో (Karnataka) ఓ గుత్తేదారు నుంచి లంచం తీసుకుంటూ భాజపా ఎమ్మెల్యే (MLA) విరూపాక్షప్ప కుమారుడు లోకయుక్తాకు (Lokayukta) చిక్కిన విషయం తెలిసిందే. అనంతరం ఆయన ఇల్లు, కార్యాలయంలో సోదాలు జరపగా.. సుమారు రూ.8కోట్లకు పైగా నగదు లభ్యమైంది. ఈ కేసులో భాజపా ఎమ్మెల్యే విరూపాక్షప్పను ప్రధాన నిందితుడిగా (A1) చేర్చినట్లు తెలుస్తోంది. లోకాయుక్త విశ్వసనీయ వర్గాల ప్రకారం,  ఈ వ్యవహారంలో ఎమ్మెల్యే తరఫునే ఆయన కుమారుడు లంచం తీసుకున్నట్లు సమాచారం. అయితే, ప్రస్తుతం ఎమ్మెల్యే ఆచూకీ లేదని.. ముందస్తు బెయిల్‌ కోసం దరఖాస్తు చేసుకున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.

కర్ణాటకలోని దావణగెరె జిల్లా చెన్నగిరి శాసనసభ్యుడు మాడాళు విరూపాక్షప్ప (Virupakshappa) కర్ణాటక సోప్స్‌ అండ్ డిటర్జెంట్స్ లిమిటెడ్ (KSDL)కు ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. ఆయన తనయుడు ప్రశాంత్ మదాల్‌ బెంగళూరులోని జలమండలిలో చీఫ్‌ అకౌంటెంట్‌గా పని చేస్తున్నాడు. ఓ టెండరు విషయంలో గుత్తేదారు నుంచి రూ.81 లక్షలు ఇవ్వాలని ప్రశాంత్‌ డిమాండ్‌ చేశారని ఆరోపణ. ఈ క్రమంలో బాధితుడు కర్ణాటక లోకాయుక్తాను ఆశ్రయించాడు. దీంతో రంగంలోకి దిగిన లోకాయుక్తలోని అవినీతి నిరోధక శాఖ విభాగం పక్కా ప్రణాళిక రచించింది. చివరకు గుత్తేదారు నుంచి ప్రశాంత్‌ లంచం తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంది.

ఎఫ్‌ఐఆర్‌లో ఎమ్మెల్యే పేరు..

గుత్తేదారు నుంచి తీసుకున్న రూ.40లక్షల (తొలి విడత) లంచంతో సహా మొత్తం రూ.2.02కోట్ల నగదును ఆయన కార్యాలయంలో అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కొన్ని గంటల్లోనే ప్రశాంత్‌ ఇంటిపైనా లోకాయుక్త అధికారులు సోదాలు జరిపారు. అక్కడ భారీగా నోట్ల కట్టలు లభ్యమయ్యాయి. అర్ధరాత్రి వరకూ కొనసాగిన ఆ సోదాల్లో రూ.6కోట్లను గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ కేసులో ఎమ్మెల్యే కుమారుడు ప్రశాంత్‌తో సహా మొత్తం ఐదుగురిని అరెస్టు చేశామని.. ఎమ్మెల్యే పాత్రపైనా దర్యాప్తు జరుపుతున్నామని కర్ణాటక లోకాయుక్త జస్టిస్‌ (రిటైర్డ్‌) బీఎస్‌ పాటిల్‌ వెల్లడించారు. ఎఫ్‌ఐఆర్‌లో ఎమ్మెల్యే పేరు నమోదు చేశామని.. పూర్తిస్థాయి దర్యాప్తు జరుపుతున్నామన్నారు.

ఛైర్మన్‌ పదవికి రాజీనామా..

కుమారుడు లంచం కేసులో చిక్కుకోవడంతో విరూపాక్షప్ప కేఎస్‌డీఎల్‌ ఛైర్మన్ పదవికి రాజీనామా చేశారు. తన కుటుంబంపై ఏదో కుట్ర జరుగుతోందని పేర్కొంటూ ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మైకి లేఖ రాశారు. ఈ వ్యవహారంపై స్పందించిన సీఎం బొమ్మై.. దీనిపై లోకాయుక్త స్వతంత్ర దర్యాప్తు జరుపుతుందని చెప్పారు. ఇదే సమయంలో కాంగ్రెస్‌పైనా సీఎం బొమ్మై విమర్శలు గుప్పించారు.

తండ్రి ఛైర్మన్‌.. కొడుకు వసూళ్లు..

లంచం తీసుకుంటూ లోకాయుక్తకు చిక్కిన భాజపా ఎమ్మెల్యే కుమారుడు వ్యవహారంపై కాంగ్రెస్‌ పార్టీ ఘాటుగా స్పందించింది. ‘40శాతం’ పేరుతో సామాన్యుడిని బొమ్మై ప్రభుత్వం దోచుకుంటోందంటూ ఆరోపించింది. ‘తండ్రి ఛైర్మన్‌.. కొడుకు నగదు తీసుకుంటాడు’ అంటూ విమర్శలు గుప్పించింది. రూ.40లక్షల లంచం, ఇంట్లో కోట్ల నగదు దొరకడం చూస్తుంటే భాజపాకు అవినీతితో ఉన్న బంధం అర్థమవుతోందని కాంగ్రెస్‌ నేత రణ్‌దీప్‌ సూర్జేవాలా ఆరోపించారు. భాజపా 40శాతం కమిషన్‌ ప్రభుత్వమనడానికి తాజా వ్యవహారం ఒక రుజువు అని కర్ణాటక కాంగ్రెస్‌ చీఫ్‌ డీఏ శివకుమార్‌ కూడా పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని