WHO: సుదీర్ఘ పని గంటలతో ‘గుండె’కు ముప్పు

సాధారణ పనిగంటల కంటే అధికంగా పని చేసే ఉద్యోగుల్లో గుండె జబ్బుల ముప్పు ఎక్కువగా ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ సోమవారం వెల్లడించింది. అంతర్జాతీయ కార్మిక సంస్థ, ప్రపంచ ఆరోగ్య సంస్థ సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో ఈ అంశాలు వెలుగు చూశాయి.

Updated : 17 May 2021 14:21 IST

కరోనాతో మారిన పని తీరు
వెల్లడించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ సర్వే

జెనీవా: సాధారణ పనిగంటల కంటే అధికంగా పని చేసే ఉద్యోగుల్లో గుండె జబ్బుల ముప్పు ఎక్కువగా ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ సోమవారం వెల్లడించింది. అంతర్జాతీయ కార్మిక సంస్థ, ప్రపంచ ఆరోగ్య సంస్థ సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో ఈ అంశాలు వెలుగు చూశాయి. తాజాగా ఎన్విరాన్‌మెంట్‌ ఇంటర్నేషనల్‌ జర్నల్‌లో ఈ పరిశోధనకు సంబంధించిన పత్రాలు ప్రచురితమయ్యాయి. అందులో తెలిపిన వివరాల ప్రకారం.. వారానికి 55 గంటల కంటే ఎక్కువ పని గంటలు చేసిన ఉద్యోగుల్లో సుమారు 7 లక్షల 45వేలకు పైగా 2016లో గుండెపోటు, గుండెకు సంబంధించిన వ్యాధుల కారణంగా మరణించారన్నారు. ఇది గత పదేళ్లలో 30 శాతం పెరిగిందన్నారు. చైనా, జపాన్‌, ఆస్ట్రేలియా దేశాల్లో ఈ తరహా మరణాలు ఎక్కువగా ఉన్నట్లు అందులో పేర్కొన్నారు. ఈ ముప్పునకు గురవుతున్న వారిలో 72 శాతం మంది నడివయసు పురుషులు ఉన్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎన్విరాన్‌మెంట్‌, వాతావరణ మార్పులు, ఆరోగ్య విభాగ అధిపతి మారియా నైరా తెలిపారు. ఉద్యోగుల ఆరోగ్యం కోసం తగిన చర్యలు తీసుకుంటామని ఆమె అన్నారు. 2000 నుంచి 2016 వరకు 194 దేశాల్లో ఈ సర్వేను నిర్వహించినట్లు వారు తెలిపారు. వారానికి 55 గంటల కంటే ఎక్కువ పనిచేసే వారిలో 35 శాతం ఎక్కువగా గుండెపోటు వచ్చే అవకాశాలున్నట్లు పరిశోధనలో వెల్లడైంది.

కరోనాతో పెరిగిన ముప్పు

ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్‌ టెడ్రోస్‌ అధనామ్‌ మాట్లాడుతూ.. కరోనా కారణంగా ప్రతి రంగంలో వచ్చిన ఒడుదొడుకులను ఎదుర్కొనేందుకు ప్రస్తుతం ఎక్కువ మంది అధిక పనిగంటలు చేస్తున్నట్లు గుర్తించామన్నారు. దీని కోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించాల్సిన అవసరముందని ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికారులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని