G20 Summit: భారత్‌కు మద్దతిచ్చేందుకు ఎదురు చూస్తున్నాం: జో బైడెన్‌

అగ్రరాజ్యం అమెరికాకు భారత్‌ ‘బలమైన భాగస్వామి’ అని ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్‌ అన్నారు. జీ20 అధ్యక్షుడి హోదాలో తన స్నేహితుడు మోదీకి మద్దతివ్వడానికి ఎదురు చూస్తున్నట్లు ట్విటర్‌లో ఆయన పేర్కొన్నారు.

Published : 03 Dec 2022 01:15 IST

వాషింగ్టన్‌: అగ్రరాజ్యం అమెరికాకు భారత్‌ ‘బలమైన భాగస్వామి’ అని ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్‌ (Joe Biden) అన్నారు. ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన కూటముల్లో ఒకటైన  జీ-20 అధ్యక్ష పదవిని భారత్‌ అధికారికంగా స్వీకరించిన నేపథ్యంలో ఆయన ట్విటర్‌ వేదికగా స్పందించారు. జీ20 అధ్యక్షుడి హోదాలో తన స్నేహితుడు మోదీకి (Modi) మద్దతివ్వడానికి ఎదురు చూస్తున్నట్లు పేర్కొన్నారు. ‘ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్‌’ అనే ఇతివృత్తం ప్రేరణతో ఏకత్వాన్ని ప్రోత్సహించేందుకు కృషి చేస్తామని అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన సందర్భంగా గురువారం ప్రధాని మోదీ చెప్పిన సంగతి తెలిసిందే. తద్వారా ఉగ్రవాదం, వాతావరణ మార్పులు, మహమ్మారులు వంటి సవాళ్లను కలిసికట్టుగా ఎదుర్కోవచ్చన్నారు. అధ్యక్ష హోదాలో కేవలం జీ20 కూటమిలో దేశాలను దృష్టిలో ఉంచుకొని భారత్‌ తన ప్రాధామ్యాలను నిర్ణయించదని, దక్షిణాది దేశాలన్నింటికీ ఉపయుక్తంగా ఉండేలా కార్యాచరణ సిద్ధం చేస్తుందని మోదీ పేర్కొన్నారు. భారత్‌ జీ-20 అజెండా ప్రతిష్ఠాత్మకంగా, కార్యాచరణ ఆధారితంగా, నిర్ణయాత్మకంగా ఉంటుందని స్పష్టం చేశారు.

మరోవైపు భారత్‌, అమెరికా(America) దేశాలు వాతావరణం, శక్తి, ఆహార సంక్షోభాల వంటి భాగస్వామ్య సవాళ్లను ఎదుర్కొంటూనే స్థిరమైన అభివృద్ధిని సాధిస్తాయని జో బైడెన్‌ నొక్కి చెప్పారు. వచ్చే ఏడాది జీ-20 సదస్సు సెప్టెంబరు 9, 10 తేదీల్లో దిల్లీలో నిర్వహించనున్న విషయం తెలిసిందే. గత నెలలో ఇండోనేసియాలోని బాలిలో జరిగిన జీ-20 కూటమి రెండు రోజుల సదస్సు ముగింపు సందర్భంగా ఆ దేశం నుంచి అధ్యక్ష బాధ్యతలను భారత్ గురువారం లాంఛనంగా చేపట్టింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని