Shashi Tharoor: ‘వందే భారత్‌’ సరే.. కానీ సుదీర్ఘ ‘వెయిటింగ్‌’కు తెరపడేదెప్పుడు?

రైల్వేలో సుదీర్ఘ వెయిటింగ్‌ లిస్టుల సమస్యకు ఎప్పుడు తెరపడుతుందని కాంగ్రెస్‌ నేత శశిథరూర్‌ ప్రశ్నించారు. 75 ఏళ్ల స్వతంత్ర భారతంలో.. కన్‌ఫాం బెర్త్ అనేది అదృష్టానికి సంబంధించిన విషయం కాకూడదని, అదొక సాధారణ సౌకర్యంగా మారాలని ఆకాంక్షించారు.

Published : 31 May 2023 01:16 IST

తిరువనంతపురం: రైళ్లలో ‘వెయిటింగ్‌ లిస్ట్‌ (Waiting List)’ సమస్య ప్రయాణికులకు తలనొప్పిగా మారుతోంది. 2022- 23లో ఏకంగా 2.7 కోట్ల మందికి పైగా ప్రయాణికులు ఆన్‌లైన్‌లో టికెట్‌ బుక్‌ చేసుకున్నప్పటికీ.. వెయిటింగ్ లిస్ట్‌ కారణంగా ప్రయాణించలేకపోయారని రైల్వే శాఖ (Indian Railways) ఇటీవల వెల్లడించింది. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, ఎంపీ శశిథరూర్‌ (Shashi Tharoor) తాజాగా ఇదే అంశాన్ని లేవనెత్తారు. రైల్వేలో ఈ సుదీర్ఘ వెయిటింగ్‌ లిస్టుల (Train Waiting List)కు ఎప్పుడు తెరపడుతుందని ట్విటర్‌ వేదికగా కేంద్రాన్ని ప్రశ్నించారు.

‘సుదీర్ఘ వెయిటింగ్‌ లిస్టులు ఎప్పుడు ముగుస్తాయి? 2022- 23లో దాదాపు 2.7 కోట్ల మంది రైల్వే ప్రయాణికులు వెయిటింగ్‌ లిస్ట్‌లోనే మిగిలిపోయారు. ఇదొక ట్రెండ్‌గా మారింది. ఏటా.. మునుపటి ఏడాది రికార్డు బద్దలవుతోంది. వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌లను ప్రవేశపెట్టడం స్వాగతించదగినదే. కానీ, కేవలం దానిపైనే దృష్టి సారించడం ఆందోళన కలిగించే విషయం. 75ఏళ్ల స్వతంత్ర భారతంలో.. బెర్త్‌ కన్‌ఫాం కావడం అనేది కేవలం అదృష్టానికి సంబంధించిన విషయం కాకూడదు. అదొక సాధారణ సౌకర్యంగా మారాలి. ఈ అంశంపై తక్షణమే ప్రభుత్వం దృష్టి సారించాలి’ అని శశిథరూర్‌ పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా, 2022-23 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 1.76 కోట్ల పీఎన్‌ఆర్‌ నంబర్లపై 2.72 కోట్ల మంది ప్రయాణించాల్సి ఉండగా.. వెయిటింగ్‌ లిస్ట్‌ కారణంగా ఆటోమేటిక్‌గా వారి టికెట్లు రద్దయిపోయినట్లు రైల్వే బోర్డు వెల్లడించింది. 2021-22లో దాదాపు 1.06 కోట్ల పీఎన్‌ఆర్‌ నంబర్లపై 1.65 కోట్ల మంది రైలు ప్రయాణానికి దూరమయ్యారు. అధిక రద్దీ ఉన్న రూట్లలో తగినన్ని రైళ్లు లేకపోవడాన్ని ఈ సమస్య ప్రతిబింబిస్తోంది. అయితే, డిమాండ్‌కు తగినట్టుగా రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు రైల్వే బోర్డు తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని