
Viral Video: ఘనంగా ‘ప్రేమికుల జాతర’... ఎక్కడంటే?
మకర సంక్రాంతి సందర్భంగా ఉత్తర్ప్రదేశ్లోని బాందా నగరంలో నిర్వహించిన ‘ప్రేమికుల జాతర’ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రెండ్రోజుల పాటు జరిగిన ఈ ఉత్సవాలకు సుదూర ప్రాంతాల నుంచి వందలాది మంది తరలివచ్చారు. ఈ ప్రాంతంలో నిర్మించిన నట్బాలీ బాబా ఆలయంలో ప్రేమికులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తమ కోరికను బాబాతో చెప్పుకుంటే.. నెరవేరుతుందనేది వారి నమ్మకం.
ఇదీ కథ: 600 ఏళ్ల క్రితం మహోబా జిల్లా సుగిరా ప్రాంతానికి చెందిన నోనే అర్జున్ సింగ్ అనే రాజు.. భురాగఢ్ ప్రాంతాన్ని పాలించేవారు. మధ్యప్రదేశ్లోని సారాబాయి ప్రాంతంలోని నట్ సమాజానికి చెందిన బీరన్ అనే 21 ఏళ్ల యువకుడు ఆ కోటలో సేవకుడిగా ఉండేవాడు. మంత్రతంత్రాలతో పాటు అన్నీ రంగాల్లో అపార నైపుణ్యం అతని సొంతం. ఈ క్రమంలోనే బీరన్ను రాజు కూతురు ప్రేమించింది. బీరన్ను పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకుని తండ్రికి తెలపగా.. రాజు ఓ షరతు విధించారు. కేన్ నదికి అవతలివైపు ఉన్న బాంబేశ్వర్ పర్వతంపైన కోట నుంచి భురాగఢ్ కోట వరకు నదిపైన తాడు సాయంతో బీరన్ రాగలిగితే.. అతనికి ఇచ్చి వివాహం చేస్తానని చెప్పారు. ఈ షరతును అంగీకరించిన బీరన్.. రెండు కోటల మధ్య నదిపై తాడు ద్వారా వచ్చే ప్రయత్నం చేశాడు. ఇంతలో రాజు.. తాడుని తెగ్గొట్టడంతో బీరన్ కోట ప్రకారాలపై పడి మరణిస్తాడు. ఇది తెలుసుకున్న రాజు కుమార్తె.. కోటపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటుంది. వీరి ప్రేమకు చిహ్నంగా ఆ ప్రాంతంలో వారి సమాధులను నిర్మించి వాటి పైన గుడి కట్టారు. నాటి నుంచి సంక్రాంతి రోజున ప్రత్యేక పూజలు చేస్తున్నారు.