Ludhiana: తన కేసులో రికార్డులను నాశనం చేసేందుకే.. లుథియానా కోర్టులో బాంబు దాడి..!

పంజాబ్‌లో కలకలం సృష్టించిన లుథియానా జిల్లా కోర్టులో బాంబు పేలుడు ఘటనకు సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ ఘటనలో ప్రాణాలు

Published : 25 Dec 2021 13:11 IST

చండీగఢ్‌: పంజాబ్‌లో కలకలం సృష్టించిన లుథియానా జిల్లా కోర్టులో బాంబు పేలుడు ఘటనకు సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వ్యక్తిని.. 2019లో డిస్మిస్‌ అయిన హెడ్‌ కానిస్టేబుల్‌ గగన్‌దీప్‌ సింగ్‌గా గుర్తించిన విషయం తెలిసిందే. అయితే తనపై నమోదైన ఓ డ్రగ్స్‌ కేసులో రికార్డులను నాశనం చేసేందుకు గగన్‌దీప్‌ ఈ పేలుడుకు పాల్పడినట్లు విశ్వసనీయ వర్గాలు తాజాగా వెల్లడించాయి. 

గత గురువారం లుథియానా జిల్లా కోర్టు సముదాయంలోని రెండో అంతస్తులో శక్తిమంతమైన బాంబు పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. ఈ ఘటనతో పంజాబ్‌ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఘటనాస్థలంలో మొబైల్‌ సిమ్‌కార్డు, వైర్‌లెస్‌ డోంగిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. వీటి ఆధారంగా మృతుడిని గగన్‌దీప్‌ సింగ్‌గా గుర్తించారు.

లుథియానాలోని ఖన్నా ప్రాంతానికి చెందిన గగన్‌దీప్‌ను మాదకద్రవ్యాల అక్రమ రవాణా కేసులో 2019లో విధుల నుంచి తొలగించారు. ఆ తర్వాత పోలీసులు అతడిని అరెస్టు చేశారు. రెండేళ్ల పాటు జైల్లో ఉన్న గగన్‌దీప్‌.. సెప్టెంబరులో బెయిల్‌పై విడుదలయ్యాడు. కేసు విచారణలో భాగంగా అతడు కోర్టుకు హాజరుకావాల్సి ఉంది. ఈ క్రమంలోనే కేసు నుంచి బయటపడేందుకు అతడు ఈ కుట్ర పన్నినట్లు విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. 

కేసుకు సంబంధించిన పేపర్లను భద్రపరిచే కోర్టు రికార్డు గదిని బాంబుతో పేల్చేయాలని ప్రణాళిక చేసుకున్న గగన్‌దీప్‌.. వాష్‌రూంలో బాంబును అమర్చుతుండగా ఒక్కసారిగా అది పేలిపోయింది. పేలుడు ధాటికి అక్కడున్న నీటి పైపు పగిలిపోయింది. బాంబుకు సంబంధించిన కీలక భాగాలు ప్రవాహంలో కొట్టుకుపోవడంతో దర్యాప్తు క్లిష్టంగా మారిందని పోలీసు వర్గాలు తెలిపాయి. అయితే పేలుడు పదార్థాలను గగన్‌దీప్‌ ఎక్కడి నుంచి తీసుకొచ్చాడన్నది మాత్రం ఇంకా తెలియరాలేదు. ఇప్పటికే అతడి ఇంటి నుంచి పోలీసులు ల్యాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడి సోదరుడు, స్నేహితులను విచారిస్తున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని