నెలకు ₹30వేల జీతం.. ఇంట్లో ₹30లక్షల టీవీ, 7 లగ్జరీ కార్లు!

Corrupted Officer: వయసు 36 ఏళ్లు.. పదేళ్లుగా ప్రభుత్వ శాఖలో ఉద్యోగం.. నెలకు రూ.30వేల జీతం.. కానీ ఆమె ఆస్తులు మాత్రం రూ.7కోట్లకు పైనే..! ఓ ప్రభుత్వ అధికారిణి అవినీతి చిట్టా చూసి.. అధికారులే నోరెళ్లబెట్టారు.

Updated : 12 May 2023 21:08 IST

భోపాల్‌: మధ్యప్రదేశ్‌ (Madhya Pradesh)లో ఓ ప్రభుత్వ అధికారిణి అవినీతి బాగోతాన్ని అవినీతి నిరోధక అధికారులు (anti-corruption) బయటపెట్టారు. ప్రభుత్వ శాఖలో చిరుద్యోగిగా చేరిన ఆమె.. దశాబ్ద కాలంలోనే కోట్లకు పడగలెత్తింది. ఆమె ఇంట్లో 20 వాహనాలుండగా.. అందులో ఐదు నుంచి ఏడు వరకు లగ్జరీ కార్లు ఉన్నాయట. ఇక ఖరీదైన వస్తువులు, 100 శునకాలను చూసి అధికారులు అవాక్కయ్యారు.

భోపాల్‌కు చెందిన హేమా మీనా  (Hema Meena) 2011లో ఒప్పంద ప్రాతిపదికన మధ్యప్రదేశ్‌ పోలీస్ హౌసింగ్‌ కార్పొరేషన్‌ విభాగంలో చేరారు. ప్రస్తుతం ఆమె ఇన్‌ఛార్జ్‌ అసిస్టెంట్‌ ఇంజినీర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. నెలకు రూ.30వేల జీతం తీసుకునే మీనా.. ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించారని అవినీతి నిరోధక (anti-corruption) అధికారులకు 2020లో ఫిర్యాదు అందింది. దీంతో దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలోనే లోకాయుక్త స్పెషల్‌ పోలీస్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ విభాగానికి చెందిన బృందం.. గురువారం సాధారణ దుస్తుల్లో మీనా ఇంటికి వెళ్లింది. వాచ్‌మెన్‌ వారిని అడ్డుకోగా..  సోలార్‌ ప్యానెల్స్‌ను రిపేర్‌ చేసేందుకు వచ్చామని చెప్పి లోపలికి వెళ్లారు. ఇంట్లోకి వెళ్లగానే మీనాను తమ కస్టడీలోకి తీసుకుని తనిఖీలు చేపట్టగా.. కళ్లు చెదిరే సంపద బయటపడింది.

ఆస్తుల చిట్టా ఇది..

ఒక్క రోజు చేసిన తనిఖీల్లోనే అధికారులు.. రూ.7కోట్ల విలువైన ఆస్తుల వివరాలను బయటకు తీశారు. మీనాకు వచ్చే అన్ని రకాల ఆదాయం కంటే ఇది 232శాతం అధికం కావడం గమనార్హం. ఆమె తొలుత 20వేల చదరపు అడుగుల వ్యవసాయ భూమిని ఆమె తండ్రి పేరు మీద కొనుగోలు చేసినట్లు ఈ తనిఖీల్లో తేలింది. ఆ తర్వాత ఆ స్థలంలో రూ.కోటితో లగ్జరీ విల్లాను నిర్మించినట్లు అధికారులు తెలిపారు. పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ చేపట్టే ప్రాజెక్టుల కోసం తీసుకొచ్చిన నిర్మాణ మెటీరియల్‌ను కూడా మీనా తన ఇంటి నిర్మాణం కోసం వినియోగించిందట.

ఇక ఆమె ఇంట్లో 20 వాహనాలుండగా.. అందులో 5-7 లగ్జరీ కార్లు ఉన్నాయి. రూ.30లక్షల విలువ చేసే 98 అంగుళాల అత్యాధునిక టీవీ సెట్‌, పూర్తి వైర్‌లెస్‌ కమ్యూనికేషన్‌ సిస్టమ్‌, మొబైల్‌ జామర్స్‌ వంటి వస్తువులున్నాయని అధికారులు తెలిపారు. ఆమె ఇంట్లో 100 పెంపుడు శునకాలు, 20కి పైగా మేలు జాతి పశువులు, భారీ వ్యవసాయ యంత్రాలు, హార్వెస్టర్లు వంటి వాటిని అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. శునకాలకు రోటీలు తయారు చేసేందుకు ఓ రోటీ మిషనే ఉంది. పోలీసు హౌసింగ్‌ బోర్డుకు చెందిన లక్షల విలువ చేసే పరికరాలు ఆమె ఇంట్లో చూసి అధికారులు కంగుతిన్నారు. భోపాల్‌లోని బిల్ఖిరియాలో మీనా ఇంటితో పాటు రైసెన్‌, విదిశ జిల్లాల్లోనూ ఆమెకు వ్యవసాయ భూములు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఆమె ఆస్తులపై మరిన్ని తనిఖీలు చేయనున్నట్లు పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని