ఆ గ్రామంలో వందశాతం వ్యాక్సినేషన్‌

దేశంలో కరోనా టీకాలకు తీవ్ర కొరత ఏర్పడిన కారణంగా చాలా మంది వ్యాక్సిన్‌కు దూరమవుతున్నారు. మరోవైపు వీలైనంత తొందరగా 18 ఏళ్లు దాటిన వారందరికీ వ్యాక్సిన్‌ వేయించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పటిష్ఠ చర్యలు చేపడుతున్నాయి...

Published : 17 Jun 2021 15:38 IST

భోపాల్‌: దేశంలో కరోనా టీకాలకు తీవ్ర కొరత ఏర్పడిన కారణంగా చాలా మంది వ్యాక్సిన్‌కు దూరమవుతున్నారు. మరోవైపు వీలైనంత తొందరగా 18 ఏళ్లు దాటిన వారందరికీ వ్యాక్సిన్‌ వేయించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పటిష్ఠ చర్యలు చేపడుతున్నాయి. అయినప్పటికీ చాలా మందికి వ్యాక్సిన్‌ అందడం లేదు. కానీ, మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌ జిల్లా మేఘవాన్ పరియత్‌ గ్రామంలో మాత్రం అర్హులైన వారందరికీ తొలిడోసు వ్యాక్సిన్ పూర్తయినట్లు అక్కడి అధికారులు తెలిపారు. ఆ గ్రామంలో మొత్తం 1,002 ఓటర్లు ఉన్నారు. వీరిలో 956 మంది తొలి వ్యాక్సిన్‌ తీసుకున్నారు. వీరిలో ఇద్దరు శతాధిక వృద్ధులు కూడా ఉన్నారు.  మిగతా 46 మందిలో తాజాగా కరోనా వైరస్‌ నుంచి కోలుకున్న వారు, గర్భిణీ స్త్రీలు ఉన్నారు. వీరంతా వైద్యుల సూచనల మేరకు వ్యాక్సిన్‌ వేయించుకోలేదు.

ఆ రాష్ట్రంలో వంద శాతం వ్యాక్సినేషన్‌ పూర్తి చేసుకున్న తొలి గ్రామంగా మేఘవాన్‌ పరియత్‌ రికార్డు సృష్టించింది. దీంతో ప్రోత్సాహకంగా స్థానిక ఎమ్మెల్యే సుశీల్‌ తివారీ ఇందు ఆ గ్రామాభివృద్ధి కోసం రూ.5 లక్షలు ఆర్థిక సాయం చేశారు. ఇద్దరు శతాధిక వృద్ధులకు చెరో రూ.5000 అందజేశారు. గతంలో జమ్ముకశ్మీర్‌లోని బందిపోరా జిల్లాలోని వయాన్‌ గ్రామం వందశాతం వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్న గ్రామంగా అవతరించిన విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని