ఒక్క రాష్ట్రంలోనే 58% యాక్టివ్‌ కేసులు!

దేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తి రోజురోజుకీ పెరుగుతోంది. మహారాష్ట్రలోనే గత కొన్ని రోజులుగా 15వేలకు పైగా కొత్త కేసుల రావడంతో భారత్‌లో కేసుల గ్రాఫ్‌ మళ్లీ........

Published : 15 Mar 2021 22:32 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మహారాష్ట్రలోనే గత కొన్ని రోజులుగా 15వేలకు పైగా కొత్త కేసుల రావడంతో భారత్‌లో కేసుల గ్రాఫ్‌ మళ్లీ పెరుగుతోంది. నిన్న ఒక్కరోజే మహారాష్ట్రలో 16,620 కొత్త కేసులు రాగా.. తాజాగా 15వేలకు పైగా పాజిటివ్‌ కేసులు నమోదవ్వడం అక్కడ వైరస్‌ ఉద్ధృతికి అద్దంపడుతోంది. మరోవైపు, దేశ వ్యాప్తంగా 77%కి పైగా యాక్టివ్‌ కేసులు కేవలం మూడు రాష్ట్రాల్లో ఉండగా.. వాటిలో 58.15% ఒక్క మహారాష్ట్రలోనే నమోదు కావడం గమనార్హం. ఇకపోతే కేరళలో 13.58%, పంజాబ్‌ 5.27%, కర్ణాటక 3.82%, తమిళనాడు 2.22% చొప్పున యాక్టివ్‌ కేసులు ఉండగా.. దేశంలో మిగతా రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలన్నీ కలిపితే 16.93% యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

యాక్టివ్‌ కేసుల్లో టాప్‌ 15 జిల్లాలివే..

మహారాష్ట్ర, కేరళ, పంజాబ్‌ రాష్ట్రాల్లో కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్న టాప్‌ 15 జిల్లాలను కేంద్రం ప్రకటించింది. మహారాష్ట్రలో పుణె, నాగ్‌పూర్‌, ముంబయి, ఠానే, నాసిక్‌; కేరళలో ఎర్నాకుళం, పతనంమిట్ట, కన్నూర్‌, త్రిశ్శూర్‌, కోజికోడ్‌; పంజాబ్‌లో జలంధర్‌, ఎస్‌ఏఎస్‌ నగర్‌, ఎస్‌బీఎస్‌ నగర్‌, పటియాల, హోషియార్‌పూర్‌లలో యాక్టివ్‌ కేసులు అధికంగా ఉన్నాయి. మరోవైపు, ఎనిమిది రాష్ట్రాల్లోనే కొత్త కేసులు పెరుగుదల నమోదవుతోందని కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. మహారాష్ట్ర, తమిళనాడు, పంజాబ్‌, మధ్యప్రదేశ్‌, దిల్లీ, గుజరాత్‌, కర్ణాటక, హరియాణాలలో కొత్త కేసులు పెరుగుతుండగా.. గత నెల రోజులుగా కేరళలో తగ్గుదల నమోదవుతోందని పేర్కొన్నారు.

ఎల్లుండి సీఎంలతో మోదీ సమీక్ష!
దేశంలో కొత్తగా కరోనా కేసులు నమోదవుతున్న రాష్ట్రాల సీఎంలతో ప్రధాని నరేంద్ర మోదీ సమీక్ష నిర్వహించనున్నారు. బుధవారం మధ్యాహ్నం 12.30గంటలకు ఆయన పలు రాష్ట్రాల సీఎంలతో దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహిస్తారని సమాచారం.

మహారాష్ట్ర తాజా బులెటిన్‌.. 
మహారాష్ట్రలో గడిచిన 24గంటల్లో 15,051 కొత్త కేసులు, 48 మరణాలు నమోదు కాగా.. 10671 మంది డిశ్చార్జి అయ్యారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 23,29,464కి చేరింది. వీరిలో 21,44,743 మంది కోలుకోగా.. 52,909 మంది మృతిచెందారు. ప్రస్తుతం 1,30,547 క్రియాశీల కేసులు ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని