అసలు నిజాన్ని ఎప్పటికి కనుగొంటారు..?

ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేశ్‌ అంబానీ ఇంటికి సమీపంలో జరిగిన పేలుడు పదార్థాల వాహనం కేసు విచారణలో

Published : 08 Aug 2021 02:02 IST

ఎన్‌ఐఏను విమర్శించిన మహారాష్ట్ర కాంగ్రెస్‌

ముంబయి: ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేశ్‌ అంబానీ ఇంటికి సమీపంలో జరిగిన పేలుడు పదార్థాల వాహనం కేసు విచారణలో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) జాప్యం చేస్తోందని మహారాష్ట్ర కాంగ్రెస్‌ విమర్శించింది. ఘటన జరిగి 150 రోజులు గడుస్తున్నా కేసు దర్యాప్తు ముందుకు సాగట్లేదని ఆరోపించింది. దీనిపై కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి సచిన్‌ సావంత్‌ శనివారం మాట్లాడుతూ.. ‘ఘటన జరిగి ఇప్పటికే 150 రోజులు గడిచిపోయాయి. అయినా కేసు విచారణ పూర్తి కాలేదు. కేసులో చార్జ్‌షీట్ దాఖలు చేయడానికి కాల పరిమితి 90 రోజులే.. కానీ, అదనంగా 30 రోజుల గడువును ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టు మంజూరు చేసింది. ఎందుకోసం విచారణ గడువును పెంచుకుంటూ పోతున్నారు. ఘటనకు సంబంధించిన అసలు నిజాన్ని ఎప్పటికి కనుగొంటారు’ అని ప్రశ్నించారు. 
ఫిబ్రవరి 25న దక్షిణ ముంబయిలోని అంబానీ నివాసం సమీపంలో పేలుడు పదార్థాలతో కూడిన వాహనం నిలిచి ఉండటం కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఈ కేసు అనేక మలుపులు తిరుగుతోంది. పోలీసులు వాహనాన్ని గుర్తించిన కొద్ది రోజులకే ఆ వాహన యజమాని మన్‌సుఖ్‌ హిరెన్‌ ఓ వాగులో శవమై దొరకడం కలకలం రేపింది. అనంతరం ఈ కేసు దర్యాప్తును ఎన్ఐఏ చేపట్టి సంచలన విషయాలను వెలుగులోకి తెచ్చింది. అప్పటివరకు ఆ కేసు దర్యాప్తు చేసిన పోలీసు అధికారి సచిన్‌ వాజేనే ఆ వాహనాన్ని ముకేశ్‌ అంబానీ ఇంటివద్ద నిలిపినట్లు ధ్రువీకరించారు. అతడిని అరెస్టు చేసి విచారిస్తున్నారు. వాజేకు సహకరించిన ఇద్దరు పోలీసును గతంలో అరెస్టు చేయగా తాజాగా మరో పోలీసు అధికారిని అదుపులోకి తీసుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని