Amruta Fadnavis: ‘బెదిరించింది.. రూ. కోటి ఇస్తానంది’: డిజైనర్‌పై అమృతా ఫడణవీస్‌ కేసు

ఓ డిజైనర్‌ తనను బ్లాక్‌ మెయిల్ చేసేందుకు ప్రయత్నించారంటూ మహారాష్ట్ర డిప్యూటీ సీఎం భార్య అమృత (Amruta Fadnavis) పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై తగిన విచారణ జరుపుతామని మహారాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. 

Updated : 16 Mar 2023 14:54 IST

ముంబయి: మహారాష్ట్ర (Maharashtra) ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ (Devendra Fadnavis) భార్య అమృతా ఫడణవీస్‌ (Amruta Fadnavis).. ఓ డిజైనర్‌పై పోలీసు కేసు పెట్టారు. అనిక్ష అనే మహిళ తనను బెదిరిస్తోందని, బ్లాక్‌మెయిల్‌ చేసేందుకు యత్నించిందని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిబ్రవరి 20న చేసిన ఫిర్యాదులో ఆ మహిళ తండ్రిని కూడా చేర్చారు. ఆమె తండ్రికి సంబంధించిన క్రిమినల్ కేసులో జోక్యం చేసుకోవడానికి రూ.కోటి ఇవ్వజూపిందని అని కూడా చెప్పారు. దీనికి సంబంధించిన వివరాలు తాజాగా బయటకు వచ్చాయి. 

అమృత చేసిన ఫిర్యాదులో ఎప్పుడు ఏం జరిగింది అనే వివరాలు ఉన్నాయి. ‘‘2021 నవంబర్‌లో నన్ను అనిక్ష కాంటాక్ట్‌ అయింది. తానొక డిజైనర్‌ని పరిచయం చేసుకుంది. బయట జరిగే కార్యక్రమాల్లో తన డిజైనర్ దుస్తులు,ఆభరణాలు, చెప్పులు ధరించాలని కోరింది. దాని వల్ల తన ఉత్పత్తులకు ప్రచారం లభిస్తుందని చెప్పింది. ఆమె చెప్పిన మాటలు నమ్మి నేను అలాగే అన్నాను. నాతో మొదటి పరిచయంలోనే తన కుటుంబ విషయాలు వెల్లడించింది. తనకు తల్లి లేదని చెప్పింది. తర్వాత ప్రతిసారి నా సిబ్బందికి తన ఉత్పత్తులు ఇచ్చి, నాకు చేర్చమని చెప్పేది. వాటిని బహిరంగ కార్యక్రమాల్లో ధరించమని కోరేది. అయితే ఏదైనా కార్యక్రమంలో వాటిని ధరించానో లేదో నాకు గుర్తులేదు. మళ్లీ వాటిని ఆమెకు ఇచ్చేయమంటూ నా సిబ్బందికి చెప్పాను. ఇప్పుడు ఆమెకు సంబంధించిన వస్తువులేవీ నా దగ్గర లేవు’’ అని ఫిర్యాదులో అమృత పేర్కొంది.

రూ. కోటి ఇస్తామని చెప్పింది: అమృత

‘‘ఇంకోసారి కలిసినప్పుడు తన తండ్రికి పలు రాజకీయ పార్టీ నేతలతో సంబంధాలున్నాయని  చెప్పింది. నా సిబ్బంది ద్వారా ఓ కవర్‌ను నాకు అందించింది. నేను దాన్ని తెరిచి చూస్తే.. అందులో చేతిరాతతో ఉన్న నోట్ కనిపించింది. అందులో ఉన్నదేమిటో అర్థంకాక పక్కన పెట్టేశాను. తర్వాత ఓ రోజు నా భద్రతా సిబ్బందిని ఏమార్చి నా కారులో కూర్చుంది. బుకీస్‌ గురించి తన తండ్రి పోలీసులకు సమాచారం ఇస్తాడని, దాంతో ఎలా డబ్బు సంపాదించవచ్చో చెప్పింది. దాంతో నేను వెంటనే కారు ఆపి, ఆమెను దించేశాను. ఫిబ్రవరి 16న నాకు ఫోన్‌ చేసి తన తండ్రి కేసు గురించి చెప్పి, అతడిని కేసు నుంచి బయటపడేస్తే.. రూ.కోటి ఇస్తానని మాట్లాడింది. ఆ మాట వినగానే నేను ఫోన్ కట్‌ చేసి, నంబర్ బ్లాక్‌ చేశాను. ఇక ఫిబ్రవరి 18,19 తేదీల్లో ఒక గుర్తు తెలియని నంబర్ నుంచి వీడియో క్లిప్స్‌, వాయిస్‌ మెసేజ్‌లు పంపింది’’ అని అమృత ఫిర్యాదులో పేర్కొన్నట్లు ఓ మీడియా సంస్థ వెల్లడించింది.

అనిక్ష, ఆమె తండ్రిపై కుట్ర, అవినీతి నిరోధక చట్టం కింద పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేశారు. ఈ ఫిర్యాదుపై తగిన విచారణ జరుపుతామని గురువారం దేవేంద్ర ఫడణవీస్‌ వెల్లడించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని