Corona Virus: కేంద్రం ఆదేశం.. కొవిడ్‌ నియంత్రణ చర్యల్లో పలు రాష్ట్రాలు!

కొవిడ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని కేంద్రం దిశానిర్దేశం చేసింది. ఈ క్రమంలో పలు రాష్ట్రాలు కొవిడ్‌ నిబంధలను అమల్లోకి తీసుకొస్తున్నాయి.

Updated : 23 Dec 2022 01:05 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: చైనా (China) సహా వివిధ దేశాల్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కొవిడ్‌ (Corona Virus)ను ఎదుర్కొనేందుకు రద్దీ ప్రదేశాల్లో ప్రజలు మాస్కులు ధరించేలా చూడాలని రాష్ట్రాలకు దిశానిర్దేశం చేసింది. ప్రికాషన్‌ డోసుల్ని ప్రోత్సహించడంతోపాటు, శానిటైజర్లు వాడాలని ప్రజలకు సూచించింది. కేంద్రం సూచనల నేపథ్యంలో కొన్ని రాష్ట్రాలు కొవిడ్‌ నియంత్రణ చర్యల్ని చేపడుతున్నాయి. 

కేవలం బహిరంగ ప్రదేశాల్లో మాత్రమే కాకుండా ఇండోర్స్‌లోనూ మాస్కులు ధరించాలని కర్ణాటక ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఏసీ గదుల్లోనూ మాస్కును తప్పనిసరి చేసింది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అంతర్జాతీయ ప్రయాణికుల్లో ర్యాండమ్‌గా 2 శాతం మంది నమూనాలను సేకరించి ల్యాబ్‌కు పంపిస్తామని ఆ రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది.

కొత్త వేరియంట్లపై ఆందోళన అక్కర్లేదని తెలంగాణ (Telangana) ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. కొవిడ్‌ వ్యాప్తిపై రాష్ట్రప్రభుత్వం అప్రమత్తంగా ఉన్నట్లు చెప్పారు. ఔషధాలు, ఆక్సిజన్‌, ఐసీయూ పడకలను సిద్ధంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. పాజిటివ్‌గా తేలిన నమూనాలను జీనోమ్‌ సీక్వెన్స్‌ కోసం గాంధీ ఆస్పత్రికి తరలించాలన్నారు.

బీఎఫ్‌ 7 వేరియంట్‌ కేసులు గతంలో నమోదయ్యాయని, అయితే ప్రస్తుతం నమోదవుతున్న కేసులకు  ఆ వేరియంట్‌తో సంబంధం లేదని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ అన్నారు. సేకరించిన నమూనాలను జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ చేస్తున్నామన్నారు. ఒకవేళ పరిస్థితులు ప్రతికూలంగా మారినా భయాందోళనలకు గురికావాల్సిన పని లేదని, ఇప్పటికే దిల్లీ పరిధిలో 8 వేల పడకలను సిద్ధంగా ఉంచామని అన్నారు. మరో  36వేల పడకలను సిద్ధం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పారు.

కొవిడ్‌ కేసుల పెరుగుదలపై రాష్ట్ర ప్రభుత్వం ఓ కన్నేసి ఉంచిందని పశ్చిమ్‌బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. రాష్ట్రంలో పరిస్థితులను ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తున్నామన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా 95శాతం వ్యాక్సినేషన్‌ పూర్తయినట్లు మహారాష్ట్ర (Mahashtra) ఆరోగ్యశాఖ మంత్రి తనాజీ సావంత్‌ వెల్లడించారు. కరోనా వ్యాప్తి కట్టడికి టెస్ట్‌, ట్రాక్‌, ట్రీట్‌,వ్యాక్సినేట్‌, ర్యాండమ్‌ థర్మల్‌ స్క్రీనింగ్‌ పద్దతిని అమలుచేస్తున్నట్టు చెప్పారు. కేంద్రప్రభుత్వం చెప్పిన విధంగా అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ర్యాండమ్‌గా 2శాతం మంది నమూనాలను సేకరించి పరీక్షలకు పంపిస్తామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని