‘లాక్‌డౌన్‌కు ప్రత్యామ్నాయాలపై సీఎంకు విజ్ఞప్తి’

రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు స్వయంగా టెస్టులు చేయించుకోవాలని రాష్ట్ర ఆరోగ్య మంత్రి రాజేశ్‌ తోపే కోరారు. ఈ మేరకు ఆయన బుధవారం మీడియాతో వెల్లడించారు.

Updated : 31 Mar 2021 14:39 IST

ముంబయి: మహారాష్ట్రలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు స్వయంగా టెస్టులు చేయించుకోవాలని రాష్ట్ర ఆరోగ్య మంత్రి రాజేశ్‌ తోపే కోరారు. ఈ మేరకు ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. ‘ప్రజలు ఆలస్యంగా టెస్టులు చేయించుకుంటున్న కారణంగా.. ఆస్పత్రుల్లోని ఐసీయూల్లో ఆక్సిజన్‌ పడకలు వేగంగా నిండిపోతున్నాయి. కాబట్టి ప్రజలు లక్షణాలు ఉన్నట్లు అనిపిస్తే.. వెంటనే తమంతట తాము వచ్చి పరీక్షలు చేయించుకోవాలి’ అని రాజేశ్‌ తెలిపారు.

ఎన్సీపీ నేత నవాబ్‌ మాలిక్‌ మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలో ప్రస్తుతం లాక్‌డౌన్‌ విధించలేం. కరోనా కట్టడికి లాక్‌డౌన్‌ కాకుండా ఇతర ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలించాలని నేను సీఎం ఉద్ధవ్‌ ఠాక్రేకు విజ్ఞప్తి చేశా. ప్రజలు తప్పనిసరిగా కొవిడ్‌ నిబంధనలు పాటిస్తే లాక్‌డౌన్‌తో పని ఉండదు’ అని మాలిక్‌ తెలిపారు. కాగా, రాష్ట్రంలో కేసులు పెరుగుతున్న తరుణంలో ప్రజలు నిబంధనలు పాటించకపోతే లాక్‌డౌన్‌ను  పరిశీలించాల్సి వస్తుందని ఇప్పటికే సీఎం ఠాక్రే హెచ్చరించిన విషయం తెలిసిందే. కాగా, మహారాష్ట్రలో గడిచిన 24 గంటల్లో 27వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. 139 మంది కరోనాతో ప్రాణాలు వదిలారు.

నాసిక్‌లో పోలీసుల వినూత్న నిర్ణయం 
నాసిక్‌లో మార్కెట్ల రద్దీని కట్టడి చేసేందుకు అధికారులు వినూత్న నిర్ణయం తీసుకున్నారు. మార్కెట్లలోకి వెళ్లడానికి ప్రజలు గంటకు రూ.5 చెల్లించేలా టికెట్‌ను నిర్ణయించారు. నాసిక్‌ నగర పోలీస్‌ కమిషనర్ దీపక్‌ పాండే మాట్లాడుతూ.. ‘మార్కెట్‌ ప్రాంతాల్లో కొవిడ్‌ కట్టడికి వినూత్న నిర్ణయం తీసుకున్నాం. మార్కెట్‌లో రద్దీని తగ్గించేలా వినియోగదారులకు గంటకు రూ.5 టికెట్‌ ఏర్పాటు చేశాం. పరిస్థితి లాక్‌డౌన్‌ వరకూ వెళ్లకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం’ అని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని