Train tragedies: భారతీయ రైల్వేలో.. మహా విషాదాలు!

భారతీయ రైల్వేలో (Indian Railways) గత మూడు దశాబ్దాల్లో చోటుచేసుకున్న భారీ ప్రమాదాల్లో వందల మంది ప్రాణాలు కోల్పోయారు.

Updated : 03 Jun 2023 17:29 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మన దేశంలో రైల్వే (Indian Railways) తన ప్రయాణాన్ని మొదలుపెట్టి 170 ఏళ్లు అయ్యింది. ఈ పదిహేడు దశాబ్దాల్లో భారత రైల్వే ప్రగతి సాధిస్తూ.. కోట్ల మంది ప్రయాణికుల కీలక రవాణా మార్గంగా నిలిచింది. ఈ క్రమంలో రైల్వేలో మానవ తప్పిదాలు, సిగ్నలింగ్‌ వ్యవస్థలో లోపం, ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఎన్నో ప్రమాదాలు కూడా చోటుచేసుకున్నాయి. ఇలా గత మూడు దశాబ్దాల్లో దేశంలో తీవ్ర విషాదాన్ని నింపిన భారీ రైలు ప్రమాదాలు కొన్ని సంఘటనలను గుర్తుచేసుకుంటే..

బిహార్‌ మహా విషాదం: బిహార్‌లో జూన్‌ 6, 1981లో జరిగిన రైలు ప్రమాదం భారత రైల్వే చరిత్రలో అత్యంత ఘోరమైనదిగా నిలిచింది. మాన్సీ నుంచి సహర్సాకు వెళ్తున్న రైలు.. భాగమతి నది దాటుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. తొమ్మిది బోగీలతో వెళ్తున్న రైలు బ్రిడ్జి దాటుతున్న సమయంలో అందులోని ఏడు బోగీలు పట్టాలు తప్పి నదిలో పడిపోయాయి. ఆ సమయంలో రైలులో సుమారు వెయ్యి మందికిపైగా ప్రయాణికులు ఉండగా.. అందులో దాదాపు 750 మంది నదిలో కొట్టుకుపోయినట్లు అంచనా. అయితే, ఐదు రోజుల సహాయక చర్యల అనంతరం కేవలం 235మంది మృతదేహాలు మాత్రమే లభ్యమైనట్లు ప్రభుత్వం ప్రకటించింది.

* ఫిరోజాబాద్‌ రైలు ప్రమాదం: 1995 ఆగస్టు 20న ఉత్తర్‌ప్రదేశ్‌లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఆగ్రాకు సమీపంలోని ఫిరోజాబాద్‌లో పురుషోత్తం ఎక్స్‌ప్రెస్‌- కాళింది ఎక్స్‌ప్రెస్‌లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 358 మంది ప్రయాణికులు మృత్యువాతపడ్డారు.

* గౌసల్‌ రైలు విషాదం: 1999 ఆగస్టు 2వ తేదీన అస్సాంలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. అవద్‌-అస్సాం ఎక్స్‌ప్రెస్‌ రైలును బ్రహ్మపుత్ర మెయిల్‌ ఢీకొట్టింది.ఈ ఘటనలో సుమారు 290 మంది చనిపోయారు.

ఖన్నా రైల్‌ ప్రమాదం: 1998 నవంబర్‌ 26న పంజాబ్‌లో రైలు ప్రమాదంలో 212 ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. కాళింది ఎక్స్‌ప్రెస్‌ను జమ్మూ తవీ-సియాల్దా ఎక్స్‌ప్రెస్‌ ఢీ కొట్టింది. పంజాబ్‌ సమీపంలోని ఖన్నాలో జరిగిన ఈ ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది.

పెరుమాన్‌ రైలు ప్రమాదం: 1981 జులై 8న కేరళలో జరిగిన రైలు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. పెరుమాన్‌ సమీపంలో జరిగిన ప్రమాదంలో 150 మంది ప్రాణాలు కోల్పోయారు. లోకల్‌ ప్యాసింజర్‌ రైలును ఐలాండ్‌ ఎక్స్‌ప్రెస్‌ ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.

* కాన్పూర్‌ రైలు ప్రమాదం: 2016 నవంబర్‌ 20న ఉత్తర్‌ప్రదేశ్‌ కాన్పూర్‌ సమీపంలోని పుఖరాయన్‌ వద్ద ఇందౌర్‌-పట్నా రైలు పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో సుమారు 150 మంది ప్రాణాలు కోల్పోయారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని