పంచాయతీ ఎన్నికలు: భార్యలు గెలిస్తే.. భర్తల ప్రమాణస్వీకారం

సాధారణంగా గ్రామాల్లో పంచాయతీ సభ్యులుగా మహిళలు గెలిస్తే వారి స్థానంలో భర్తలు విధులు నిర్వహించడం, అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడం వంటివి తరచూ చూస్తేనే ఉంటాం. కానీ, ఈ పంచాయతీ ఎన్నికల్లో

Updated : 06 Aug 2022 13:02 IST

భోపాల్‌: సాధారణంగా గ్రామాల్లో పంచాయతీ సభ్యులుగా మహిళలు గెలిస్తే వారి స్థానంలో భర్తలు విధులు నిర్వహించడం, అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడం వంటివి తరచూ చూస్తేనే ఉంటాం. కానీ, ఈ పంచాయతీ ఎన్నికల్లో మహిళలు గెలిచినా.. వారి భర్తలు లేదా తండ్రులు ప్రమాణస్వీకారం చేశారు. ఈ విడ్డూరం మధ్యప్రదేశ్‌లోని కొన్ని గ్రామాల్లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..

మధ్యప్రదేశ్‌లో ఇటీవల పంచాయతీ ఎన్నికలు జరిగాయి. గెలిచిన వారు ప్రమాణస్వీకారం చేశారు. అయితే సాగర్‌, దమోహ్‌ జిల్లాల్లోని కొన్ని గ్రామాల్లో గెలిచిన మహిళల స్థానంలో వారి కుటుంబంలోని మగ బంధువులు ప్రమాణం చేయడం స్థానికంగా వివాదాస్పదంగా మారింది. జైసినగర్‌ గ్రామంలో 10 మంది మహిళలు పంచాయతీ సభ్యులుగా ఎన్నికవ్వగా.. ఓ మహిళ స్థానంలో ఆమె తండ్రి ప్రమాణం చేశారు. మరో ఇద్దరు మహిళల భర్తలు, మరో మహిళ బావ ప్రమాణస్వీకారం చేశారు. దామోహ్‌ జిల్లాలోని గైసాబాద్‌, పిపారియా కిరౌ గ్రామాల్లోనూ ఇలాంటి ఘటనలే జరిగాయి.

ఇందుకు సంబంధించి దృశ్యాలు సోషల్‌మీడియాలో వైరల్‌ కావడంతో ఈ వ్యవహారం బయటికొచ్చింది. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవడంతో సాగర్‌ జిల్లా పంజాయతీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ విచారణకు ఆదేశించారు. జైసినగర్‌ గ్రామ పంచాయతీ సెక్రటరీ ఆశారాం సాహూను విధుల నుంచి సస్పెండ్‌ చేశారు. అయితే దీనిపై సాహూ మాట్లాడుతూ.. ‘‘పంచాయతీ సభ్యులుగా గెలిచిన మహిళలను ప్రమాణస్వీకారానికి రమ్మని ఎన్నిసార్లు పిలిచినా వారు రాలేదు. వారికి బదులుగా తమ బంధువులను పంపించారు. దీంతో చేసేదేం లేక, వారితోనే ప్రమాణం చేయించాం’’ అని చెప్పడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని