విద్యార్థులకు క్రెడిట్‌ కార్డులు.. ప్రారంభించిన దీదీ

విద్యార్థులకు రుణ సదుపాయం కల్పించేలా ‘Students Credit card’ పథకాన్ని పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రారంభించారు......

Updated : 24 Nov 2022 15:24 IST

కోల్‌కతా: విద్యార్థులకు రుణ సదుపాయం కల్పించేలా ‘స్టూడెంట్‌ క్రెడిట్‌ కార్డు’ పథకాన్ని పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రారంభించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు బుధవారం ఆమె కోల్‌కతాలో ఈ వినూత్న పథకానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా దీదీ మాట్లాడుతూ.. విద్యార్థులకు క్రెడిట్‌ కార్డు పథకాన్ని ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. బెంగాల్ యువత స్వావలంబన కోసం వార్షిక సాధారణ వడ్డీతోనే రూ.10 లక్షల వరకు రుణం అందించనున్నట్టు చెప్పారు. బెంగాల్‌కు చెందిన విద్యార్థులు ఉన్నత విద్యా సంస్థల్లో చేరినవారితో పాటు కోచింగ్‌ సెంటర్లలో పరీక్షలకు సన్నద్ధమవుతున్న అందరికీ ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరనుందని చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చినహామీలను నెరవేర్చేందుకు తమ ప్రభుత్వం అవిశ్రాంతంగా పని చేస్తోందని పేర్కొన్నారు. 

పశ్చిమ బెంగాల్ నుంచి ఉన్నత విద్యనభ్యసించే విద్యార్థులను మరింతగా ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం స్టూడెంట్‌ క్రెడిట్‌ లాంటి సమగ్రమైన పథకాన్నిఅమలు చేయాలని గతంలో నిర్ణయించిందని విద్యాశాఖకు చెందిన ఓ సీనియర్‌ అధికారి తెలిపారు.  15 ఏళ్లలో తిరిగి చెల్లించే కాల పరిమితితో చాలా నామమాత్రపు వార్షిక సాధారణ వడ్డీ రేటుతో రూ.10లక్షలు రుణం ఇస్తున్నట్టు చెప్పారు. ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ‘స్టూడెంట్‌ క్రెడిట్‌ కార్డు పథకం’ అమలు చేస్తామని తృణమూల్‌ కాంగ్రెస్‌ మ్యానిఫెస్టోలో ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రెడిట్‌ కార్డు ద్వారా 4 శాతం వడ్డీతో రూ.10 లక్షల వరకు విద్యార్థులకు రుణాలు మంజూరు చేస్తామని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని