Pune: పీఎంఓ అధికారినంటూ కోతలు.. నకిలీ ఐఏఎస్‌ అరెస్టు!

రహస్య ఆపరేషన్‌ (Secret operation) కోసం పీఎంవో (PMO) నుంచి వచ్చానని చెప్పుకొంటున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఇతర నేరాలతో అతడికి ఏమైనా సంబంధాలు ఉన్నాయా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

Published : 01 Jun 2023 23:45 IST

పుణె: ప్రధానమంత్రి కార్యాలయంలో (PMO) అధికారినని చెప్పుకొంటున్న ఓ వ్యక్తిని అరెస్టు చేసినట్లు పుణె క్రైం బ్రాంచ్‌ పోలీసులు (Crime Branch Police) వెల్లడించారు. నిందితుడిని మహారాష్ట్రలోని (Maharashtra) జల్‌గావ్‌కు చెందిన 54 ఏళ్ల వాసుదేవ్‌ నివృత్తిగా గుర్తించారు. తాను ఓ ఐఏఎస్‌ అధికారినని, రహస్య మిషన్‌ చేపట్టేందుకు ప్రధాని కార్యాలయం నుంచి వచ్చానంటూ అతడు చెప్పుకొనేవాడు. ఈ క్రమంలో మే 29న ఓ ఎన్జీవో సంస్థ నిర్వహించిన కార్యక్రమానికి హాజరైన వాసుదేవ్‌.. తాను ఓ ఐఏఎస్‌ అధికారినంటూ పరిచయం చేసుకున్నాడు. పీఎంఓ ఆదేశాల మేరకు ఓ సీక్రెట్‌ మిషన్‌ కోసం ఇక్కడికి వచ్చినట్లు చెప్పాడు. అసలు పేరు చెప్పకుండా.. తన పేరు డా.విన్‌య్ దేవ్‌గా పేర్కొన్నాడు. 

తనతోపాటు పని చేస్తున్న ఇతర సీనియర్‌ అధికారుల గురించి ఎన్జీవో నిర్వాహకులు ఆరా తీయగా.. నీళ్లు నమిలాడు. అక్కడి నుంచి మెల్లగా జారుకున్నాడు. అనుమానం వచ్చిన ఎన్జీవో సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులకు అతడు నకిలీ ఐఏఎస్‌ అని అనుమానం వచ్చింది. దీంతో అతడి మొబైల్‌ సిగ్నల్స్‌ ఆధారంగా పట్టుకునేందుకు ప్రయత్నించారు. అయితే, ఎప్పటికప్పుడు లోకేషన్‌ మారిపోతుండటంతో కొంచెం ఆటంకాలు ఎదురయ్యాయి. ఎట్టకేలకు మే 30న మహారాష్ట్రలోని తలెగాన్‌ దబాడేలో ఉన్నట్లు గుర్తించి అతడిని అదుపులోకి తీసుకొని విచారించగా నకిలీ అధికారి అని తేలింది. సీక్రెట్‌ మిషన్‌ కోసం పని చేస్తున్నట్లు అబద్ధాలు చెప్పాడని పోలీసులు నిర్థారించుకున్నారు. ఐపీసీ సెక్షన్‌ 170, 419 ప్రకారం కేసులు నమోదు చేశారు. ఇతర నేరాలతో ఇతడికి సంబంధాలేమైనా ఉన్నాయా? అన్న కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. ఇదే తరహా నేరారోపణలపై ధూలే పోలీస్‌స్టేషన్‌ పరిధిలో 2000 సంవత్సరంలోనూ వాసుదేవ్‌పై కేసు నమోదైంది. అతడు బీకాంలో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసి, ఎంఏ చదివినట్లు తెలుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని