Sharad Pawar: శరద్‌ పవార్‌కు బెదిరింపులు.. పంపింది భాజపా కార్యకర్త..?

ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ (Sharad Pawar)ను చంపేస్తామంటూ వచ్చిన బెదిరింపుల వెనుక నిందితుడిని పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. అతడో భాజపా కార్యకర్త అని సమాచారం.

Published : 10 Jun 2023 13:47 IST

ముంబయి: నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (NCP) అధ్యక్షుడు శరద్‌ పవార్‌ (Sharad Pawar)కు ‘హత్య బెదిరింపులు’ రావడం రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపింది. దీంతో పోలీసులు ఈ ఘటనపై సత్వర దర్యాప్తు చేపట్టారు. కాగా.. ఈ బెదిరింపు సందేశాలను అమరావతికి చెందిన భాజపా కార్యకర్త (BJP Activist) సౌరభ్‌ పింపాల్కర్‌ పంపినట్లు తెలుస్తోంది. ఈ మేరకు పలు మీడియా కథనాలు వెల్లడించాయి. (Death Threats To Sharad Pawar)

‘నీకూ నరేంద్ర దభోల్కర్‌ గతే పడుతుంది’ అని శరద్‌ పవార్‌ను బెదిరిస్తూ తనకు వాట్సప్‌లో సందేశాలు వచ్చాయని ఆయన కుమార్తె, ఎంపీ సుప్రియా సూలే (Supriya Sule) శుక్రవారం తెలిపిన విషయం తెలిసిందే. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పలు విపక్ష రాజకీయ నేతల నుంచి ఘాటు స్పందనలు రావడంతో సీఎం ఏక్‌నాథ్‌ శిందే విచారణకు ఆదేశించారు. ఈ క్రమంలోనే పోలీసులు (Mumbai Police) దర్యాప్తు చేపట్టగా.. ఆ మెసేజ్‌ను సౌరభ్‌ పింపాల్కర్‌ పంపినట్లు తేలిందని సమాచారం. ఇదే బెదిరింపు మెసేజ్‌ను అతడు తన ట్విటర్‌ ఖాతాలోనూ షేర్‌ చేసినట్లు తెలుస్తోంది. ట్విటర్‌ బయోలో తాను భాజపా కార్యకర్తగా సౌరభ్‌ పేర్కొన్నాడని పోలీసులు చెప్పినట్లు సదరు కథనాలు వెల్లడించాయి. అయితే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదు. 

కాగా.. మెసేజ్‌ పంపిన తర్వాత నుంచి సౌరభ్‌ పరారీలో ఉన్నాడు. అతడి ఫోన్‌ కూడా స్విచ్చాఫ్‌ ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. అమరావతి యూనివర్శిటీ లా పరీక్ష పేపర్‌ లీక్‌ కేసులో సౌరభ్ సహ నిందితుడిగా ఉన్నాడు. ఈ ఘటనపై ఎన్సీపీ నేత అజిత్‌ పవార్‌ స్పందించారు. ‘‘నిందితుడు భాజపా కార్యకర్త అని తెలిసింది. దీన్ని దర్యాప్తు సంస్థలు తీవ్రంగా పరిగణించి అతడిని వెంటనే అరెస్టు చేయాలి. దీని వెనుక ప్రధాన సూత్రధారులు ఎవరో బయటపెట్టాలి’’ అని డిమాండ్‌ చేశారు.

నరేంద్ర దభోల్కర్‌ మూఢనమ్మకాల నిర్మూలనకు పోరాడిన సామాజిక కార్యకర్త. 2013 ఆగస్టు 20న ఇద్దరు ఆగంతుకులు బైక్‌పై వచ్చి ఆయన్ను కాల్చి చంపారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని