Manipur: మణిపుర్‌లో పరిస్థితులు సద్దుమణిగేందుకు కొంత సమయం పడుతుంది: సీడీఎస్‌

మణిపుర్‌(Manipur)లో పరిస్థితులు చక్కబడటానికి సమయం పడుతుందని చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్ స్టాప్‌ జనరల్‌ అనిల్‌ చౌహాన్‌ పేర్కొన్నారు. మరోవైపు కేంద్ర హోమ్‌ మంత్రి అమిత్‌షా వివిధ వర్గాలతో భేటీలు నిర్వహిస్తున్నారు.

Updated : 30 May 2023 12:20 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఈశాన్య రాష్ట్రం మణిపుర్‌ హింసకు రెండు జాతుల మధ్య నెలకొన్న వైరమే కారణమని.. దానికి వేర్పాటువాదంతో ఎటువంటి సంబంధం లేదని చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ జనరల్‌ అనిల్‌ చౌహాన్‌ వెల్లడించారు. ఈ మేరకు ఆయన మంగళవారం మాట్లాడుతూ..‘‘మణిపుర్‌లో పరిస్థితికి వేర్పాటువాదంతో సంబంధం లేదు. అది కేవలం రెండు జాతుల మధ్య ఘర్షణల ఫలితం. అది శాంతిభద్రతల సమస్య. మేము రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తిగా సహకరిస్తున్నాం. మా విధులను సమర్థంగా నిర్వహించాం. పెద్ద సంఖ్యలో ప్రజల ప్రాణాలను కాపాడాం. మణిపుర్‌లో సమస్యలు తక్షణమే పరిష్కారం కావు. వాటికి కొంత సమయం పడుతుంది. అవి పూర్తిగా సద్దుమణుగుతాయని భావిస్తున్నాను’’ అని పేర్కొన్నారు.

మరోవైపు మణిపుర్‌లో నాలుగు రోజలపాటు పర్యటించేందుకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ఇప్పటికే రాష్ట్రానికి చేరుకొన్నారు. సోమవారం రాత్రి ఆయన ముఖ్యమంత్రి బీరేన్‌సింగ్‌, మంత్రి వర్గంతో సమావేశం అయ్యారు. మంగళ, బుధ వారాల్లో కూడా ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. రాష్ట్రంలో హింస చెలరేగిన చురాచాంద్‌పుర్‌లో పర్యటించనున్నారు. దీంతోపాటు కుకీ, మెయితీ వర్గాలతో ఆయన చర్చలు జరపనున్నారు.

ఈ జాతుల మధ్య హింసలో మరణించిన వారికి రూ.10 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని కేంద్రం, మణిపుర్‌ రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించాయి. దీంతోపాటు బాధిత కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం కూడా ఇవ్వనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. పరిహారం సొమ్ములో చెరి సగం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భరించనున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని