కారులో ఒంటరిగా ఉన్నా..మాస్కు పెట్టాల్సిందే

దేశంలో కరోనా వైరస్ కోరలు చాస్తోన్న వేళ..దిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

Updated : 07 Apr 2021 14:53 IST

కరోనా వేళ..దిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

దిల్లీ: దేశంలో కరోనా వైరస్ కోరలు చాస్తోన్న వేళ..దిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కారులో ఒంటరిగా ప్రయాణిస్తున్నా సరే మాస్కు ధరించాల్సిందేనని స్పష్టం చేసింది. కారులో ఒంటరిగా ప్రయాణిస్తూ మాస్కు ధరించనందుకు దిల్లీ పోలీసులు జరిమానా విధించడాన్ని సవాలు చేస్తూ వేసిన పిటిషన్‌ను విచారిస్తూ..న్యాయమూర్తి ప్రతిభా ఎం సింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు.

‘మీరు కారులో ఒక్కరే ఉన్నప్పటికీ..మాస్కు ధరించడానికి ఉన్న అభ్యంతరం ఏంటి? ఇది మీ భద్రత కోసమే. దేశంలో మహమ్మారి తీవ్రత పెరిగింది. టీకాలు తీసుకున్నా, తీసుకోకపోయినా మాస్కులు ధరించాలి’ అని దిల్లీ హైకోర్టు పిటిషనర్‌కి వెల్లడించింది. ఈ సందర్భంగా ప్రభుత్వాలు, శాస్త్రవేత్తలు చేసిన సూచనలు ప్రస్తావించడంతో పాటు..కొవిడ్‌ నుంచి రక్షణ పొందడానికి ఎవరైనా చేయగలిగేది ఇదేనని వ్యాఖ్యానించింది. అలాగే ‘కారు ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆగినప్పుడు, డ్రైవర్ తరచూ కిటికీని తీయాల్సి రావొచ్చు. కరోనా వైరస్ ఒకరి నుంచి మరొకరికి వేగంగా వ్యాప్తి చెందుతోంది. కాబట్టి ఆ సమయంలో ఎవరికైనా వ్యాధి సోకే అవకాశం ఉంటుంది’ అని పరిస్థితి తీవ్రతను గుర్తుచేసింది.

ఇదిలా ఉండగా.. కారులో ఒంటరిగా ప్రయాణిస్తోన్న వ్యక్తి మాస్కు ధరించాలనే నిబంధన ఏదీ లేదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ హైకోర్టుకు తెలిపింది. అయితే కొవిడ్ కట్టడికి రాష్ట్రాలు సొంతంగా నియమాలు రూపొందించి, అమలు చేసుకునే హక్కు ఉందని తేల్చిచెప్పింది. ప్రభుత్వ, ప్రైవేటు వాహనాల్లో ప్రజలు మాస్కులు ధరించడానికే దిల్లీ ప్రభుత్వం మొగ్గుచూపింది. గతేడాది ఏప్రిల్‌లో ఆ తరహా నిబంధనలను కూడా రూపొందించింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని