Yediyurappa: యడియూరప్ప ఇంటిపై దాడి.. రాళ్లు విసిరిన నిరసనకారులు..!

అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తోన్న వేళ కర్ణాటక(Karnataka) అధికార భాజపా తీసుకున్న నిర్ణయంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఓ వర్గానికి చెందిన నేతలు మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప ఇంటి వద్ద భారీ నిరసన చేపట్టారు. 

Published : 27 Mar 2023 17:08 IST

శివమొగ్గ: కర్ణాటక(Karnataka) మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప(Yediyurappa) ఇంటిపై దాడి జరిగింది. భారీ ఎత్తున జనాలు గుమిగూడి, ఆయన ఇంటిపై రాళ్లు విసిరారు. సోమవారం మధ్యాహ్నం శివమొగ్గలోని ఆయన నివాసం వద్ద ఈ ఘటన జరిగింది. భారీ ఎత్తున జనాలు నిరసన తెలుపుతున్న దృశ్యాలు మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. 

షెడ్యూల్ కులాలు, తెగలకు చెందిన రిజర్వేషన్లపై ఇటీవల కర్ణాటక(Karnataka) ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమే ఈ నిరసనకు కారణమైంది. ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బంజారా వర్గానికి చెందిన ప్రజలు యడియూరప్ప ఇంటికి ముందు ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసులు వారిని చెదరగొట్టడం ఆ దృశ్యాల్లో కనిపించింది. 

విద్య, ఉద్యోగాల విషయంలో షెడ్యూల్ కులాల రిజర్వేషన్లను కొత్తగా వర్గీకరించాలని కర్ణాటక ప్రభుత్వం కేంద్రానికి సిఫార్సు చేసింది. దాని ప్రకారం ఎస్పీలకు ఉన్న 17 శాతం రిజర్వేషన్లను అంతర్గత వర్గీకరణ చేస్తారు. ఏజే సదాశివ కమిషన్ నివేదిక ఆధారంగా బసవరాజ్‌ బొమ్మై( Basavaraj Bommai) ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ఈ నిర్ణయం వల్ల తాము నష్టపోతామని బంజారా వర్గం నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ఆ అంతర్గత వర్గీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఈ అగ్రనేత ఇంటిపై దాడికి దిగారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని