Mehul Choksi: బీచ్‌లో పత్రాలు విసిరేస్తూ

 పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ కుంభకోణం కేసు నిందితుడు మెహుల్‌ ఛోక్సీ అదృశ్యం.. అరెస్టు వ్యవహారం బాలీవుడ్‌ సినిమాను తలపిస్తోంది. ఆంటిగ్వాలో గత ఆదివారం ఉన్నట్టుండి ఛోక్సీ

Updated : 27 May 2021 10:32 IST

డొమినికా పోలీసులకు చిక్కిన ఛోక్సీ

డొమినికా: పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ కుంభకోణం కేసు నిందితుడు మెహుల్‌ ఛోక్సీ అదృశ్యం.. అరెస్టు వ్యవహారం బాలీవుడ్‌ సినిమాను తలపిస్తోంది. ఆంటిగ్వాలో గత ఆదివారం ఉన్నట్టుండి ఛోక్సీ అదృశ్యమయ్యాడు. దీంతో ఆ దేశ పోలీసులు సహా ఇంటర్‌పోల్‌ రంగంలోకి దిగింది. ఆయన కోసం గాలింపు చేపట్టాయి. ఈ క్రమంలోనే ఆంటిగ్వాకు పక్కనే ఉన్న చిన్న దేశం డొమినికాలోని ఓ బీచ్‌లో ఏవో పత్రాలు సముద్రంలోకి విసిరేస్తూ ఛోక్సీ పోలీసుకు చిక్కాడు.

2018 ఆరంభంలో పీఎన్‌బీ కుంభకోణం వెలుగులోకి రాకముందే భారత్‌ నుంచి పారిపోయిన ఛోక్సీ.. అప్పటికే ఉన్న ఆంటిగ్వాలో పౌరసత్వం వినియోగించుకొని అక్కడే ఉంటున్నాడు. అయితే రెండు రోజుల క్రితం ఛోక్సీ ఆంటిగ్వాలో కన్పించకుండాపోవడం కలకలం రేపింది. గత ఆదివారం సాయంత్రం డిన్నర్‌ కోసమని ఇంటి నుంచి బయటకు వచ్చిన అతడు.. ఆ తర్వాత నుంచి అదృశ్యమయ్యాడు. దర్యాప్తులో భాగంగా జాలీ హార్బర్‌ ప్రాంతంలో ఆయన వాహనాన్ని పోలీసులు గుర్తించారు. దీంతో ఛోక్సీ సముద్రం మార్గం గుండా పారిపోయి ఉంటాడనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. అతడి ఆచూకీ కోసం ఆంటిగ్వా ప్రభుత్వం ఇంటర్‌పోల్‌ను ఆశ్రయించడంతో ఎల్లో నోటీసు జారీ అయ్యింది. 

బీచ్‌లో అనుమానాస్పదంగా కన్పించి..

ఆంటిగ్వా నుంచి పారిపోయిన ఛోక్సీను మంగళవారం సాయంత్రం పక్కనే ఉన్న మరో కరేబియన్‌ దీవి డొమినికాలో గుర్తించారు. ఆ దేశ రాజధాని రొసెవులోని కేన్‌ఫీల్డ్‌ బీచ్‌లో ఛోక్సీ ఏవో పత్రాలను సముద్రంలోకి విసిరేస్తూ కన్పించాడు. దీంతో అక్కడ విధుల్లో ఉన్న పోలీసులకు అనుమానం వచ్చింది. డొమినికాకు ఎందుకొచ్చారని ప్రశ్నించగా.. ఛోక్సీ సమాధానం చెప్పేందుకు నిరాకరించాడట. దీంతో అదుపులోకి తీసుకుని విచారించగా.. అతడు ఛోక్సీ అని, ఇంటర్‌పోల్‌ ఎల్లో నోటీసు జారీ అయ్యిందని తెలిసింది. డొమినికాలో ఎయిర్‌పోర్టు సదుపాయం లేదు. దీంతో అతడు బోటు ద్వారా అక్కడకు చేరుకున్నట్లు తేలింది. కొద్ది రోజుల పాటు డొమినికాలో ఉండి.. అక్కడి నుంచి క్యూబా వెళ్లాలని ఆయన ప్లాన్‌ చేసుకున్నట్లు విచారణలో తెలిసింది. 

అయితే ఛోక్సీ సముద్రంలోకి విసిరేసిన పత్రాలేంటో మాత్రం ఇంకా తెలియరాలేదు. దీంతో వాటి కోసం స్కూబా డైవర్లు సముద్రంలో గాలింపు చేపట్టారు. ఛోక్సీ తమ అధీనంలోనే ఉన్నట్లు డొమినికా ప్రధాని కార్యాలయం ధ్రువీకరించింది.  అరెస్టుపై మరిన్ని వివరాలు ఇచ్చేందుకు అక్కడి ప్రభుత్వం నిరాకరించింది.

నేరుగా భారత్‌కే అప్పగిస్తారా..

ఇదిలా ఉండగా.. డొమినికాలో అరెస్టయిన ఛోక్సీని నేరుగా భారత్‌కే అప్పగించే అవకాశాలున్నట్లు ఊహాగానాలు వెలువడుతున్నాయి. అక్రమంగా డొమినికాలోకి ప్రవేశించిన ఛోక్సీని నిర్బంధించాలని, అటు నుంచే అటు అతడిని భారత్‌కు పంపేయాలని ఆంటిగ్వా ప్రధాని కోరినట్లు సమాచారం. ఆంటిగ్వా పౌరసత్వం ఉన్న ఛోక్సీ ప్రస్తుతం అక్కడ లేడు. డొమినికాలో అతడికి పౌరసత్వం లేదు. మరోవైపు అతడిపై ఇంటర్‌పోల్‌ రెడ్‌కార్నర్‌ నోటీసు కూడా జారీ అయ్యింది. ఈ నోటీసుల ద్వారా అతడిని నేరుగా భారత్‌కు అప్పగించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని