Choksi: భారత్‌ చెప్తేనే నన్ను అరెస్టు చేశారు 

భారత ప్రభుత్వ అధికారుల ‘ఆదేశాల’తోనే డొమినికా పోలీసులు తనను అరెస్టు చేశారని పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ కుంభకోణం నిందితుడు, వజ్రాల వ్యాపారి మెహుల్‌ ఛోక్సీ ఆరోపించారు.

Updated : 07 Jul 2021 10:44 IST

డొమినికా మంత్రిపై కోర్టుకెళ్లిన చోక్సీ

డొమినికా: భారత ప్రభుత్వ అధికారుల ‘ఆదేశాల’తోనే డొమినికా పోలీసులు తనను అరెస్టు చేశారని పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ కుంభకోణం నిందితుడు, వజ్రాల వ్యాపారి మెహుల్‌ చోక్సీ ఆరోపించారు. ఈ మేరకు డొమినికా ఇమ్మిగ్రేషన్‌ మంత్రి, అక్కడి పోలీస్‌ చీఫ్‌, దర్యాప్తు అధికారిపై హైకోర్టులో కేసు వేశారు. తనపై ఉన్న కేసులన్నంటినీ కొట్టివేయాలని కోరారు. 

చోక్సీ అదృశ్యం, అరెస్టు వ్యవహారం అనేక మలుపులు తిరుగుతున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది మే నెలలో కరేబియన్‌ దేశం ఆంటిగ్వాలో అదృశ్యమైన చోక్సీని పక్కనే ఉన్న డొమినికాలో అరెస్టు చేశారు. అక్రమంగా దేశంలోకి ప్రవేశించారంటూ అక్కడి పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం అతడు ఓ ప్రైవేటు ఆసుపత్రిలో పోలీసుల సంరక్షణలో చికిత్స తీసుకుంటున్నారు.

అయితే తాజాగా చోక్సీ అక్కడి హైకోర్టులో మరో పిటిషన్‌ దాఖలు చేశారు. ‘‘అక్రమంగా ప్రవేశించానంటూ నాపై డొమినికా పోలీసులు పెట్టిన కేసు.. స్వతంత్రంగా తీసుకున్న నిర్ణయం కాదు. దీని వెనుక మూడో పక్షం ఉంది. భారత ప్రభుత్వ అధికారుల ఆదేశాల మేరకే నాపై ఈ అభియోగాలు మోపారు. ఇది పూర్తిగా చట్టవిరుద్ధం. అందువల్ల నాపై ఉన్న అభియోగాలను కొట్టివేయాలని కోరుతున్నా’’ అని చోక్సీ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. భారత్‌కు చెందిన కొందరు వ్యక్తులు తనను బలవంతంగా ఆంటిగ్వా నుంచి డొమినికా తీసుకొచ్చారని ఆయన మరోసారి ఆరోపించారు. కిడ్నాప్‌ వ్యవహారం గురించి తాను ఎన్నిసార్లు చెప్పినా.. పోలీసులు మాత్రం ఎలాంటి దర్యాప్తు చేపట్టట్లేదని కోర్టుకు తెలిపారు. అంతేగాక, డొమినికా ఇమ్మిగ్రేషన్‌ మంత్రి తనను అక్రమ వలసదారుగా ప్రకటించారని, దీనిపై చర్యలు తీసుకోవాలని ఆయన న్యాయస్థానాన్ని కోరారు. 

పీఎన్‌బీ బ్యాంకును రూ. 13,500 కోట్లకు మోసగించిన కేసులో ప్రధాన నిందితుడైన చోక్సీ.. గత నెల 23న ఉన్నట్టుండి ఆంటిగ్వాలో అదృశ్యమైన విషయం తెలిసిందే. ఆ తర్వాత రెండు రోజులకే పక్కనే ఉన్న డొమినికాలో ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చోక్సీ అదృశ్యంపై అనేక వార్తలు వచ్చాయి. క్యూబా పారిపోయేందుకు ఆయన అక్రమంగా డొమినికాలో ప్రవేశించారని అక్కడి పోలీసులు తెలిపారు. కానీ చోక్సీ న్యాయవాదులు మాత్రం ఆయనను కిడ్నాప్‌ చేసి తీసుకెళ్లారని బలంగా వాదిస్తున్నారు. దీనిపై వారు బ్రిటన్‌ ప్రైవీ కౌన్సిల్‌ను ఆశ్రయించారు. ఈ వ్యవహారంపై డొమినికా కోర్టులో రెండు కేసులు విచారణ దశలో ఉన్నాయి. మరోవైపు ఆయనను భారత్‌కు రప్పించేందుకు ఇక్కడి దర్యాప్తు సంస్థలు కూడా ప్రయత్నిస్తున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని