Odisha Train Tragedy: కేంద్ర ప్రభుత్వం చేసిన ‘పెద్ద తప్పిదం’ అదే.. వీరప్ప మొయిలీ

రైల్వేలకు ప్రత్యేక బడ్జెట్‌ను తీసేసి కేంద్ర బడ్జెట్‌తో కలిపివేయడం ద్వారా కేంద్రం పెద్ద తప్పిదం చేసిందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వీరప్ప మొయిలీ అభిప్రాయపడ్డారు.

Updated : 06 Jun 2023 15:51 IST

దిల్లీ: ఒడిశాలోని బాలేశ్వర్‌లో జరిగిన ఘోర రైలు ప్రమాదం(Odisha Train Accident) పెను విషాదం నింపిన నేపథ్యంలో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి వీరప్ప మొయిలీ(Veerappa Moily) కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో రైల్వేలకు ప్రత్యేకంగా ఉన్న బడ్జెట్‌ను కేంద్ర బడ్జెట్‌లో విలీనం చేయడమే ఎన్డీయే ప్రభుత్వం చేసిన పెద్ద తప్పిదమన్నారు. దాని ద్వారానే రైల్వేలపై ప్రత్యేక దృష్టి లేకుండా పోయిందని అభిప్రాయపడ్డారు.గతంలో మాదిరిగా మళ్లీ వేర్వేరుగా బడ్జెట్లు ప్రవేశపెట్టడం అమలు చేయాలని కోరారు.

రైల్వే వ్యవస్థలో మౌలికమైన సమస్యలను సరిచేయకుండా, తగినంత ఆధునీకరణ, సాంకేతికతను అందిపుచ్చుకోకుండా  కేంద్ర ప్రభుత్వ పెద్దలు బుల్లెట్‌ రైళ్ల గురించి మాట్లాడుతున్నారంటూ మొయిలీ మండిపడ్డారు. 2017 నుంచి రైల్వే బడ్జెట్‌ను కేంద్ర బడ్జెట్‌తో విలీనం చేయడం ద్వారా  రైల్వేలపై ప్రత్యేక దృష్టి లేకుండా పోయిందని తెలిపారు. ఇదే ఎన్డీయే ప్రభుత్వం చేసి పెద్ద తప్పు అన్నారు. రైల్వేల్లో భద్రత, ఆధునీకరణ అంశాలను పట్టించుకోకుండా హైస్పీడ్‌ రైళ్లపై దృష్టిసారించడం తొందరపాటు చర్యేనన్నారు. రైల్వేలకు మళ్లీ ప్రత్యేక బడ్జెట్‌ తీసుకురావాలని సూచించారు. దాంతో పాటు రైల్వే శాఖలోని మౌలిక వసతులను మెరుగుపరచడంపై దృష్టిసారించాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే, బాలేశ్వర్‌లో జరిగిన ఘోర రైలు ప్రమాద ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్‌ రాజీనామా చేయాలని మెయిలీ డిమాండ్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని