Miss World 2023: ఈసారి మిస్‌ వరల్డ్‌ పోటీలు భారత్‌లోనే..దాదాపు మూడు దశాబ్దాల తర్వాత మళ్లీ!

Miss World 2023 competition: దాదాపు మూడు దశాబ్దాల తర్వాత మరోసారి భారత్‌లో విశ్వసుందరి పోటీలు జరగనున్నాయి. ఈ మేరకు మిస్‌ వరల్డ్‌ ఆర్గనైజేషన్‌ ఛైర్‌పర్సన్‌ జూలియా మోర్లీ ప్రకటన చేశారు.

Published : 08 Jun 2023 22:20 IST

(2017లో భారత్‌ నుంచి ‘మిస్‌ వరల్డ్‌’ కిరీటం దక్కించుకున్న మానుషి చిల్లర్‌)

దిల్లీ: ప్రపంచంలోని అందాల రాశులంతా ఒక్కచోటకు చేరితే.. చూడటానికి వెయ్యి కళ్లూ చాలవు! అలాంటి ఎంతో అద్భుతమైన ఈవెంట్‌కు ఈసారి భారత్‌ వేదికగా నిలవనుంది. 71వ ఎడిషన్‌ ప్రపంచ సుందరి పోటీలు(Miss world Competition) ఈ ఏడాది భారత్‌(India)లోనే నిర్వహిస్తున్నట్టు మిస్‌ వరల్డ్‌ ఆర్గనైజేషన్‌ ఛైర్‌పర్సన్‌, సీఈవో జూలియా మోర్లీ (Julia Morley) ప్రకటించారు. తుది తేదీలను ఇంకా ఖరారు చేయనప్పటికీ నవంబర్‌లో ఈ పోటీలు జరిగే అవకాశం ఉంది. ఎన్నో ప్రత్యేకతలు, విభిన్న సంస్కృతులకు నిలయంగా ఉన్న భారత్‌లో ఈ పోటీలు నిర్వహించేందుకు ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నట్టు మోర్లీ చెప్పారు. భారత్‌లో చివరిగా 1996లో మిస్‌ వరల్డ్‌ పోటీలు జరిగాయి. ఆ తర్వాత మళ్లీ ఇన్నేళ్లకు మన దేశంలో ప్రపంచ సుందరి పోటీలు జరగనుండటం విశేషం.

దాదాపు నెల రోజుల పాటు సాగే ఈ ప్రపంచ సుందరి పోటీల ఈవెంట్‌లో 130కి పైగా  దేశాల నుంచి  పోటీదారులు పాల్గొని తమ అందాలతో పాటు ప్రతిభను ప్రదర్శించేందుకు పోటీ పడతారు. అందాల పోటీల ప్రచారం కోసం ప్రస్తుతం భారత్‌లోనే ఉన్న పోలండ్‌ బ్యూటీ, 2022 ‘మిస్‌ వరల్డ్‌’ విజేత కరోలినా బీలాస్కా ఈ ప్రకటనపై హర్షం ప్రకటించారు. ఈ అందమైన దేశంలో తన అందాల కిరీటాన్ని వేరొకరికి అప్పగించేందుకు ఎంతో ఉత్సాహంగా ఉన్నట్టు చెప్పారు.  భారత్‌లోని విలువలు, భిన్నత్వంలో ఏకత్వం, గౌరవం, ప్రేమ, దయ, ఇవన్నీ ఈ ఈవెంట్‌ ద్వారా ప్రపంచానికి చూపించాలనుకుంటున్నామన్నారు.  ఇక్కడ చూసేందుకు ఇంకా చాలా ఉన్నాయని.. నెల పాటు జరిగే ఈ పోటీలకు  ప్రపంచాన్ని ఇక్కడికి తీసుకొచ్చి భారత్‌లోని ప్రత్యేకతలు,అందాలను చూపించాలనుకోవడం మంచి ఆలోచన అన్నారు.  

అలాగే, దీనిపై మిస్‌ ఇండియా యూనివర్స్‌ సినీ శెట్టి స్పందించారు. భారత్‌ అంటే ఏమిటో, ఈ దేశం వైవిధ్యం ఏమిటో చూపించేందుకు ప్రపంచ నలుమూలల వచ్చే సోదరీమణులందరినీ భారత్‌లోకి ఆహ్వానించేందుకు తాను సంతోషిస్తున్నానన్నారు. ఇలాంటి జర్నీ కోసం తాను చాలా ఉత్సాహంగా ఎదురుచూస్తున్నట్టు చెప్పారు. గతంలో ఈ ప్రతిష్ఠాత్మక టైటిల్‌ను భారత్‌ ఆరు సార్లు గెలుచుకుంది. మన దేశం నుంచి రీటా ఫరియా (1966), ఐశ్వర్యా రాయ్‌ (1994), డయానా హైడెన్‌ (1997), యుక్తాముఖి (1999), ప్రియాంకా చోప్రా (2000), మానుషి చిల్లర్‌ (2017) విశ్వసుందరి కిరీటాలను దక్కించుకున్న విషయం తెలిసిందే. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని