china: అరుణాచల్‌ప్రదేశ్‌ యువకుడి ఆచూకీ లభ్యం.. తమ వద్దే ఉన్నట్లు చైనా వెల్లడి

ఇటీవల అరుణాచల్‌ ప్రదేశ్‌కు చెందిన 17 ఏళ్ల మిరామ్‌ తరోన్‌ను చైనా సైనికులు కిడ్నాప్‌ చేసినట్లు వచ్చిన వార్తలు తీవ్ర దుమారానికి దారితీసిన విషయం తెలిసిందే. తాజాగా చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్‌ఏ) అతని ఆచూకీ కనుగొన్నట్లు భారత సైన్యం ఆదివారం తెలిపింది...

Published : 24 Jan 2022 01:52 IST

దిల్లీ: ఇటీవల అరుణాచల్‌ ప్రదేశ్‌కు చెందిన 17 ఏళ్ల మిరామ్‌ తరోన్‌ను చైనా సైనికులు కిడ్నాప్‌ చేసినట్లు వచ్చిన వార్తలు తీవ్ర దుమారానికి దారితీసిన విషయం తెలిసిందే. తాజాగా చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్‌ఏ) అతని ఆచూకీ కనుగొన్నట్లు భారత సైన్యం ఆదివారం తెలిపింది. ‘తప్పిపోయిన యువకుడిని గుర్తించినట్లు చైనా సైన్యం తెలియజేసింది. అతన్ని స్వదేశానికి తీసుకొచ్చేందుకు అవసరమైన ప్రొటోకాల్స్‌ పాటిస్తున్నాం’ అని తేజ్‌పూర్ లెఫ్టినెంట్ కర్నల్ హర్షవర్ధన్ పాండే డిఫెన్స్‌ పీఆర్‌ఓ ఒక ప్రకటనలో తెలిపారు. అప్పర్‌ సియాంగ్‌ జిల్లా జిడో గ్రామానికి చెందిన ఈ యువకుడిని చైనాకు చెందిన పీఎల్‌ఏ బలగాలు అపహరించినట్లు అరుణాచల్‌ తూర్పు ఎంపీ తాపిర్‌ గావ్‌ ఇటీవల వెల్లడించిన విషయం తెలిసిందే.

మిరామ్‌ వెంటే ఉన్న అతని స్నేహితుడు జానీ యాయింగ్‌ చైనా సైనికుల నుంచి తప్పించుకోగలిగాడని ఎంపీ గావ్‌ ట్వీట్‌ చేశారు. అయితే, రాష్ట్ర ప్రభుత్వం, భారత సైనిక వర్గాలు మాత్రం ఈ ఘటనను వ్యక్తి ‘అదృశ్యం’గా భావించాయి. వాస్తవాధీన రేఖ(ఎల్‌ఏసీ) సరిహద్దుల్లో మూలికల సేకరణతోపాటు వేటకు వెళ్లిన ఓ యువకుడు అదృశ్యమైనట్లు వెల్లడించాయి. వెంటనే ఈ విషయమై చైనా బలగాలతో హాట్‌లైన్‌ ద్వారా సంప్రదింపులు జరిపినట్లు రక్షణశాఖ వర్గాలు తెలిపాయి. తాజాగా అతని ఆచూకీపై సమాచారం అందినట్లు ప్రకటించాయి. వారం రోజుల్లో అతడిని భారత్‌కు తిరిగి అప్పగించనున్నట్లు సమాచారం.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని