Manipur: మణిపూర్‌లో తీవ్ర ఉద్రిక్తత.. ఐదు రోజులు ఇంటర్నెట్‌ బంద్‌

ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్‌లో తీవ్ర ఉద్రిక్తత నెలకొనడంతో ఐదు రోజులపాటు అక్కడ ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేశారు. శనివారం రాత్రి బిష్ణోపూర్‌లోని ఫౌగాక్చావో ఇఖాంగ్‌ వద్ద దుండగులు ఓ వాహనానికి నిప్పు పెట్టారు

Published : 07 Aug 2022 15:59 IST

గువహాటీ: ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్‌లో తీవ్ర ఉద్రిక్తత నెలకొనడంతో ఐదు రోజులపాటు అక్కడ ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేశారు. శనివారం రాత్రి బిష్ణోపూర్‌లోని ఫౌగాక్చావో ఇఖాంగ్‌ వద్ద దుండగులు ఓ వాహనానికి నిప్పు పెట్టారు. ఈ ఘటన అక్కడ సామాజిక వర్గాల మధ్య ఉద్రిక్తతకు దారి తీసింది. సంఘ వ్యతిరేక శక్తులు సామాజిక మధ్యమాల్లో విద్వేషపూరిత ప్రసంగాలను వ్యాప్తి చేస్తుండటంతో పోలీసులు ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేశారు. 

గత కొన్నాళ్లుగా ఈ రాష్ట్రంలో ఆల్‌ ట్రైబల్‌ స్టూడెంట్స్‌ యూనియన్‌ (ఏటీఎస్‌యూ) పిలుపు మేరకు ఆందోళనలు, బంద్‌లు, హైవే రాకపోకలను అడ్డుకోవడాలు జరుగుతున్నాయి. ఏటీఎస్‌యూ ఆ రాష్ట్రంలో అత్యంత శక్తిమంతమైన ఈ విద్యార్థి సంఘం. ది మణిపూర్‌ (హిల్‌ ఏరియాస్‌)అటానమస్‌ డిస్ట్రిక్ట్‌ కౌన్సిల్‌ బిల్‌ను ఆమోదించాలని ఏటీఎస్‌యూ డిమాండ్‌ చేస్తోంది. ఈ బిల్లును 2021లో ఆ రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. 

ఈ బిల్లు అమల్లోకి వస్తే ఆదివాసీ ప్రాంతాలకు పలు హక్కులు, అధికారాలు సంక్రమిస్తాయి. గురువారం రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి బిల్లు ఒక దానిని అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. కానీ, ఆ బిల్లు విద్యార్థి సంఘం డిమాండ్లకు అనుకూలంగా లేదు. పైగా అసెంబ్లీ అజెండాలో కూడా లేదు. దీంతో ఆందోళనలు చోటు చేసుకొన్నాయి. ఈ సందర్బంగా జరిగిన ఘర్షణల్లో 30 మంది విద్యార్థులు గాయపడ్డారు. ఐదుగురు ఆదివాసీ విద్యార్థి సంఘ నాయకులను అరెస్టు చేసి జైళ్లకు తరలించారు. 

ఈ నేపథ్యంలో విద్యార్థి సంఘ నాయకులను విడిచిపెట్టాలని (ఏటీఎస్‌యూఎం) నాయకులు ఆందోళన చేపట్టారు. హైవేలను పూర్తిగా దిగ్బంధించారు. ఈ క్రమంలో వాహనాలకు నిప్పుపెట్టారు. మణిపూర్‌లో పర్వత ప్రాంతాలు, లోయల్లో నివసించేవారి మధ్య తారతమ్యాలు ఎక్కువగా ఉంటాయి. పర్వత ప్రాంతాల్లో ఆదివాసీలు ఎక్కువగా ఉండగా.. లోయల్లో మెయితేయి వర్గం అధికంగా ఉంది. లోయ ప్రాంతాల వారికి ప్రభుత్వం అనుకూలంగా వ్యవహరిస్తోందన్నది పర్వత ప్రాంతాల్లోని ఆదివాసుల ఆరోపణ. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని