Modi: మోదీకి ‘విజ్లింగ్‌ విలేజ్‌’ పెట్టిన పేరు విన్నారా?

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి అరుదైన గౌరవం దక్కింది. కాంగ్‌థాంగ్‌(విజ్లింగ్‌ విలేజ్‌) ప్రజలు వారి సంప్రదాయం ప్రకారం.. మోదీకి ప్రత్యేక రాగంతో పేరు పెట్టారు. గ్రామం పర్యటకంగా అభివృద్ధి చెందేలా ప్రోత్సహిస్తున్న ప్రధాని మోదీకి గౌరవంగా ఈ పేరు పెడుతున్నట్లు తెలుపుతూ మేఘాలయ సీఎం కె. సంగ్మా

Updated : 28 Nov 2021 12:53 IST

దిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి అరుదైన గౌరవం దక్కింది. కాంగ్‌థాంగ్‌(విజ్లింగ్‌ విలేజ్‌) ప్రజలు వారి సంప్రదాయం ప్రకారం.. మోదీకి ప్రత్యేక రాగంతో పేరు పెట్టారు. గ్రామం పర్యటకంగా అభివృద్ధి చెందేలా ప్రోత్సహిస్తున్న ప్రధాని మోదీ గౌరవర్థంగా ఈ పేరు పెడుతున్నట్లు మేఘాలయ సీఎం కె. సంగ్మా ట్వీట్‌ చేశారు. ఆయన ట్వీట్‌కు స్పందించిన మోదీ.. తనకు పేరు పెట్టినందుకు ఆ గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.

మేఘాలయ రాజధాని షిల్లాంగ్‌కు 60 కి.మీ దూరంలో కింగ్‌థాంగ్‌ అనే గ్రామం ఉంది. ఇక్కడ ఖాసీ తెగకు చెందిన ప్రజలకు పేర్లు ఉండవు. ప్రతి ఒక్కరిని ప్రత్యేకమైన రాగంతో పిలుస్తుంటారు. బిడ్డ పుట్టగానే తల్లిదండ్రులు ఒక రాగాన్ని సృష్టించి.. దానినే పేరుగా భావిస్తారు. పూర్వీకుల నుంచి వచ్చిన ఈ సంప్రదాయాన్ని గ్రామస్థులు ఇంకా కొనసాగిస్తున్నారు. అందుకే ఈ గ్రామానికి ‘విజ్లింగ్‌ విలేజ్‌’ అనే పేరొచ్చింది. కాగా.. ఎత్తైన కొండలోయల్లో ఉన్న ఈ గ్రామం ప్రకృతి రమణీయంగా కనిపిస్తుంటుంది. దీంతో ప్రకృతిని ఆస్వాదించడానికి, ఇక్కడి ప్రజల సంప్రదాయాల్ని తెలుసుకోవడం కోసం దేశవిదేశాల నుంచి పర్యటకులు వస్తుంటారు. అలా ఈ గ్రామం పర్యటకంగానూ అభివృద్ధి చెందుతోంది. దీంతో ప్రపంచ పర్యాటక సంస్థ నిర్వహించే పోటీకి భారత్‌ తరఫున ఉత్తమ పర్యటక గ్రామంగా కింగ్‌థాంగ్‌ (విజ్లింగ్‌ విలేజ్‌) పేరును కేంద్రం నామినేట్‌ చేసింది. 

విజ్లింగ్‌ విలేజ్‌కు అంతర్జాతీయ స్థాయిలో పేరుప్రఖ్యాతలు తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్న ప్రధాని మోదీకి ఆ గ్రామ ప్రజలు ధన్యవాదాలు చెప్పాలనుకున్నారు. ఈ క్రమంలోనే ఓ మహిళ ప్రత్యేకమైన రాగాన్ని సృష్టించి ప్రధానికి పేరు పెట్టారు. ఈ విషయాన్ని మేఘాలయ సీఎం ట్విటర్‌ వేదికగా ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. ‘విభిన్నమైన రాగంతో పేరు పెట్టినందుకు కాంగ్‌థాంగ్ ప్రజలకు కృతజ్ఞతలు. మేఘాలయ పర్యాటక రంగం అభివృద్ధికి భారత ప్రభుత్వం కట్టుబడి ఉంది. రాష్ట్రంలో ఇటీవల జరిగిన ‘చెర్రీ బ్లోసమ్ ఫెస్టివల్’ అద్భుత చిత్రాలు కూడా నేను చూశాను. ఎంతో అందంగా ఉన్నాయి’’అని ప్రధాని ట్విట్‌లో పేర్కొన్నారు. 

Read latest National - International News and Telugu News


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని