ఆజాద్‌కు వీడ్కోలు.. మోదీ కన్నీళ్లు

కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు, రాజ్యసభలో విపక్ష నేత గులాం నబీ ఆజాద్‌ త్వరలో పదవీ విరమణ పొందుతున్నారు. ఈ సందర్భంగా పెద్దల సభలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ..

Updated : 09 Feb 2021 14:55 IST

దిల్లీ: కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు, రాజ్యసభలో విపక్ష నేత గులాం నబీ ఆజాద్‌ త్వరలో పదవీ విరమణ పొందుతున్నారు. ఈ సందర్భంగా పెద్దల సభలో మంగళవారం ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ.. ఆజాద్‌కు వీడ్కోలు పలుకుతూ భావోద్వేగానికి గురయ్యారు. కాంగ్రెస్‌ నేతతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. 

‘‘ఉద్యోగాలు, పదవులు, అధికారాలు వస్తాయి.. పోతాయి.. కానీ వాటిని ఎలా నిర్వహించాలో గులాం నబీ ఆజాద్‌ను చూసి నేర్చుకోవాలి. నాకు ఆజాద్‌ ఎంతోకాలంగా తెలుసు. నేను గుజరాత్‌కు సీఎం కాకముందు నుంచీ ఆయనతో మాట్లాడుతూ ఉండేవాడిని.  జమ్మూకశ్మీర్‌లో గుజరాతీ యాత్రికులపై ఉగ్రదాడి జరిగినప్పుడు నాకు ముందు ఫోన్‌ చేసింది ఆజాదే. ఆ రాత్రి నాకు ఫోన్‌ చేసి దాడి గురించి చెబుతూ ఆయన కన్నీటిపర్యంతమయ్యారు. అప్పుడు ప్రణబ్‌ ముఖర్జీ రక్షణమంత్రిగా ఉన్నారు. దాడిలో ప్రాణాలు కోల్పోయిన యాత్రికుల మృతదేహాలను గుజరాత్‌కు తరలించాలని ప్రణబ్‌దా భారత వాయుసేనను కోరారు. ఆ తర్వాత ఆజాద్‌ మళ్లీ ఫోన్‌ చేసి నేను ఎయిర్‌పోర్టులో ఉన్నానని చెప్పారు. ఆయన నాకు నిజమైన స్నేహితుడు. ప్రతి ఒక్కరినీ ఆయన తన కుటుంబసభ్యుల్లాగే చూసుకుంటారు’’ అని మోదీ కన్నీళ్లతో చెప్పుకొచ్చారు. 

ఈ సందర్భంగా ఆజాద్‌ సేవలకు కృతజ్ఞతలు తెలియజేశారు. రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా ఆయన స్థానాన్ని భర్తీ చేసే నేత లేరని కొనియాడారు. కేవలం పార్టీ కోసమే గాక, సభ.. దేశం కోసం ఆందోళన చెందే వ్యక్తి ఆజాద్ అని ప్రశంసలు కురిపించారు. ఆయనను ఎప్పటికీ రిటైర్‌ అవనివ్వబోనని, ఆయన సలహాలు, సూచనలు తీసుకుంటామని మోదీ తెలిపారు. ఆజాద్‌తో పాటు పలువురు రాజ్యసభ సభ్యులు వచ్చేవారం పదవీ విరమణ పొందుతున్నారు.

కాగా.. గులాం నబీ ఆజాద్‌పై మోదీ సోమవారం కూడా ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై మోదీ మాట్లాడుతూ.. ‘‘జమ్మూకశ్మీర్‌లో బ్లాక్‌, జిల్లా అభివృద్ధి మండళ్ల ఎన్నికలను బాగా నిర్వహించాని ఆజాద్‌ జీ మెచ్చుకున్నారు. ఆయన వ్యాఖ్యలను కాంగ్రెస్‌ నాయకత్వం సరిగానే అర్థం చేసుకుంటుందని భావిస్తున్నా. అలా కాకుండా.. జీ 23 ఇచ్చిన సూచన మాదిరి ఆయన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకుంటారేమోనన్నదే నా అనుమానం’’ అని ప్రధాని రాజ్యసభలో వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ నాయకత్వాన్ని మార్చాలని, పార్టీ అంతర్గత ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ.. ఆజాద్‌ సహా 23 మంది పార్టీ సీనియర్‌ నేతలు అధ్యక్షురాలు సోనియాగాంధీకి లేఖ రాయడం దుమారం రేపిన సంగతి తెలిసిందే.

ఇవీ చదవండి..

నా వ్యాఖ్యల పట్ల చింతిస్తున్నా: విజయ్‌సాయి రెడ్డి

సంస్కరణలు అవసరమే


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని