Modi: సిరిసిల్ల నేతన్నకు ప్రధాని ప్రశంస.. మన్‌ కీ బాత్‌లో కొనియాడిన మోదీ

నెలవారీ మన్‌ కీ బాత్‌లో భాగంగా తెలంగాణకు చెందిన సిరిసిల్ల నేతన్న యెల్ది హరిప్రసాద్‌ను ప్రధాని మోదీ ప్రత్యేకంగా కొనియాడారు. ఆయన జీ-20 లోగోను మగ్గంపై నేసి పంపినట్లు తెలిపారు. 

Updated : 27 Nov 2022 13:41 IST

దిల్లీ: జీ20 కూటమికి నేతృత్వం వహించడం భారత్‌కు దక్కిన గౌరవమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఇకపై కూటమిలో మనదేశ పాత్ర ఎంతో కీలకం కానుందన్నారు. ఈ సందర్భంగా సిరిసిల్ల జిల్లాకు చెందిన నేతన్న యెల్ది హరిప్రసాద్‌ తనకు ఓ బహుమతి పంపినట్లు తెలిపారు. జీ-20కి భారత్‌ నేతృత్వం వహించనున్న నేపథ్యంలో ఆయన ప్రత్యేకంగా జీ-20లోగోను మగ్గంపై నేసి తనకు పంపినట్లు వెల్లడించారు. అలాగే చేనేత పరిశ్రమ గురించి అనేక సూచనలు చేసినట్లు పేర్కొన్నారు. ప్రతినెలా చివరి ఆదివారం తన మనసులోని ఆలోచనల్ని ప్రజలతో పంచుకునే ప్రత్యేక కార్యక్రమం ‘మన్‌ కీ బాత్‌’లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 

‘‘మిత్రులారా, ఈరోజు ప్రసంగాన్ని నాకు అందిన ఓ ప్రత్యేక బహుమతి గురించి ప్రస్తావిస్తూ ప్రారంభిస్తున్నాను. తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలో యెల్ది హరిప్రసాద్‌ అనే నేతన్న ఉన్నారు. స్వహస్తాలతో నేసిన జీ20 లోగోను ఆయన నాకు పంపారు. ఆ అద్భుతమైన బహుమతిని చూసి నేను ఆశ్చర్యపోయాను. ఆయన తన నైపుణ్యంతో అందరినీ ఆకట్టుకుంటున్నారు. హరిప్రసాద్‌ నాకు ఓ లేఖ కూడా పంపారు. జీ20కి భారత్‌ నేతృత్వం వహించడం మనందరికీ గర్వకారణమన్నారు. తన తండ్రి నుంచి హరిప్రసాద్‌ ఈ నైపుణ్యాన్ని అందుకున్నారు’’ అని ప్రధాని మోదీ ప్రత్యేకంగా తెలుగువ్యక్తి హరిప్రసాద్‌ గురించి ప్రస్తావించడం విశేషం.

మరోవైపు జీ-20 సభ్యదేశాలతో వ్యాపార సంబంధాలున్న రాష్ట్రాలతో ప్రత్యేకంగా చర్చలు జరుపుతామని మోదీ తెలిపారు. అంతరిక్ష ప్రయోగాల్లో భారత్‌ మరిన్ని విజయాలు సాధిస్తోందని ఈ సందర్భంగా కొనియాడారు. మరోవైపు డ్రోన్ల వినియోగం సైతం విస్తరిస్తోందని తెలిపారు. హిమాచల్‌ప్రదేశ్‌లోని కినోర్‌లో డ్రోన్ల ద్వారా ఆపిళ్లను సరఫరా చేస్తున్నట్లు పేర్కొన్నారు. యువత సరికొత్త ఆవిష్కరణలతో ముందుకొస్తున్నారని ప్రశంసించారు. ఇండియన్‌ మ్యూజిక్‌ గ్రంథానికి ప్రపంచవ్యాప్తంగా మంచిపేరొచ్చిందని తెలిపారు. భారతీయ సంగీత పరికరాలను అనేక దేశాల్లో విక్రయిస్తున్నారన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని