Modi: రెండుసార్లు ప్రధాని అయ్యారు.. ఇంకేం కావాలి..!

‘రెండుసార్లు ప్రధానిమంత్రిగా ఎన్నికయ్యారు.. ఇంతకంటే ఇంకేం కావాలి’ అంటూ ఓ సీనియర్ ప్రతిపక్ష నేత చేసిన వ్యాఖ్యలను నరేంద్రమోదీ గుర్తుచేసుకున్నారు.

Updated : 13 May 2022 15:16 IST

ప్రతిపక్ష నేత మాటలను గుర్తుచేసుకున్న మోదీ

దిల్లీ: ‘రెండుసార్లు ప్రధానిమంత్రిగా ఎన్నికయ్యారు.. ఇంతకంటే ఇంకేం కావాలి’ అంటూ ఓ సీనియర్ ప్రతిపక్ష నేత చేసిన వ్యాఖ్యలను నరేంద్రమోదీ గుర్తుచేసుకున్నారు. గుజరాత్‌లోని బరూచ్‌లో నిన్న జరిగిన వర్చువల్‌ ర్యాలీలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

‘ఒకరోజు ప్రతిపక్ష పార్టీకి చెందిన సీనియర్ నేత ఒకరు నన్ను కలిశారు. నా రాజకీయ సిద్ధాంతాలను ఆయన ఎప్పుడూ వ్యతిరేకిస్తారు. కానీ ఆయనంటే నాకు గౌరవం. కొన్ని అంశాలపై అసంతృప్తిగా ఉన్న ఆయన నన్నొచ్చి కలిశారు. ఈ దేశం మిమ్మల్ని రెండుసార్లు ప్రధానిని చేసింది. ఇంతకంటే మీకు ఇంకేంకావాలన్నారు. ఒక వ్యక్తి రెండుసార్లు ప్రధాని అయితే.. అంతా సాధించినట్లేనని ఆ నేత అభిప్రాయపడ్డారు’ అంటూ తన అనుభవాన్ని గుర్తుచేసుకున్నారు. కొద్దిరోజుల క్రితం ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్ ప్రధానిని కలిసిన సంగతి తెలిసిందే. మహారాష్ట్రలోని పలువురు నేతలపై కేంద్ర దర్యాప్తు సంస్థలు దాడులు జరుపుతోన్న సమయంలో వీరి భేటీ జరగడం అపట్లో చర్చనీయాంశమైంది.

కాగా, కేంద్రంలో భాజపా నేతృత్వంలోని ప్రభుత్వం ఈ నెలలో ఎనిమిదేళ్ల పాలనను పూర్తి చేసుకుంటోంది. తన స్వరాష్ట్రంలో మోదీ ఈ విషయాన్ని వెల్లడించారు. ‘దేశ సేవ నిమిత్తం మీరు నన్ను దిల్లీకి పంపి ఎనిమిది సంవత్సరాలు కావొస్తుంది. ఈ సమయమంతా సుపరిపాలన అందించడానికే కేటాయించాను’ అని తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని