Gujarat Tragedy: అంతులేని బాధను అనుభవించా.. కానీ: ప్రధాని మోదీ

ప్రస్తుతం కేవడియాలో ఉన్నా కూడా తన ఆలోచనంతా మోర్బీ బాధితుల గురించేనని ప్రధాని మోదీ అన్నారు. సహాయక చర్యల్లో ఎలాంటి అలసత్వం ఉండదని మీకు హామీ ఇస్తున్నానని వెల్లడించారు.

Published : 31 Oct 2022 10:59 IST

గాంధీ నగర్‌: గుజరాత్‌లోని మోర్బీ నగరంలో మచ్చు నదిపై తీగెల వంతెన ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటన తననెంతో బాధించిందని ప్రధాని నరేంద్రమోదీ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్లిష్ట సమయంలో బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఉక్కుమనిషి సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్ జయంతి సందర్భంగా గుజరాత్‌లోని కేవడియాలో ఉన్న ఐక్యతా ప్రతిమ వద్ద ప్రధాని నివాళి అర్పించారు. 

‘ప్రస్తుతం కేవడియాలో ఉన్నా.. నా ఆలోచనంతా మోర్బీ బాధితుల గురించే. ఇంతటి బాధను అనుభవించిన సందర్భాలు చాలా తక్కువ. ఒకవైపు గుండె అంతా విషాదం నిండి ఉన్నా.. తప్పక నిర్వహించాల్సిన విధులు ముందున్నాయి. నిన్నరాత్రే గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ మోర్బీకి చేరుకున్నారు. సీఎం సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. వాటిలో ఎలాంటి అలసత్వం ఉండదని మీకు హామీ ఇస్తున్నాను. ఈ ఘటనకు గల కారణాలను గుర్తించేందుకు కమిటీని నియమించాం. ఈ క్లిష్ట సమయంలో బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుంది. గాయపడినవారికి తక్షణ వైద్యం అందేలా చూస్తున్నాం’ అని ప్రధాని విచారం వ్యక్తం చేశారు. సవాళ్లను ఎదుర్కొంటూ తన పనిని కొనసాగించిన విషయంలో పటేల్ ఆదర్శమని నివాళి అనంతరం వ్యాఖ్యానించారు. 

తీగలవంతెన దుర్ఘటనలో ఇప్పటివరకూ 132 మంది మరణించారు. ఘటన జరిగిన దగ్గరి నుంచి మరణాలు పెరుగుతూ వస్తున్నాయి. దీనిపై నిన్ననే బాధిత కుటుంబాలకు ప్రధాని పరిహారం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ. రెండు లక్షల  చొప్పున, గాయపడ్డవారికి రూ.50 వేల చొప్పున పరిహారం అందిస్తామని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని