PM Modi: బాధ్యులపై కఠిన చర్యలు : ఒడిశా రైలు ప్రమాదంపై ప్రధాని మోదీ

ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాద ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తప్పవని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు.

Updated : 03 Jun 2023 18:49 IST

భువనేశ్వర్‌: ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాద ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తప్పవని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన మోదీ.. ఈ దుర్ఘటనపై ఇప్పటికే ఉన్నతస్థాయి దర్యాప్తునకు ఆదేశించామన్నారు. ఒడిశాలోని బాలేశ్వర్‌ జిల్లాలో రైలు ప్రమాదం జరిగిన ప్రదేశంలో పర్యటించి ప్రమాదానికి గల కారణాలు, సహాయక చర్యల వివరాలను అధికారుల నుంచి తెలుసుకున్నారు. అనంతరం ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించిన ప్రధాని... గాయపడిన వారికి అత్యుత్తమ చికిత్స అందిస్తామన్నారు.

‘ఇది చాలా బాధాకరమైన విషయం. తీవ్రమైన ఘటన. దీనిపై అన్ని కోణాల్లోనూ దర్యాప్తు జరపాలని ఆదేశించాం. ప్రమాదానికి బాధ్యులైన వారిని కఠినంగా శిక్షిస్తాం. గాయపడిన వారికి ఎటువంటి చికిత్స అవసరమైనా ప్రభుత్వం అందిస్తుంది. ప్రమాదం జరిగిన వెంటనే స్పందించి సహాయక చర్యల్లో పాల్గొన్న వారికి కృతజ్ఞత తెలుపుతున్నాను’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

ప్రమాద ఘటనను పరిశీలించేందుకు దిల్లీ నుంచి ఒడిశా చేరుకున్న మోదీ.. బాహానగా బజార్‌ స్టేషన్‌కు ఎయిర్‌ఫోర్స్‌ హెలికాప్టర్‌లో ఘటనాస్థలికి చేరుకున్నారు. అక్కడి పరిస్థితులను పరిశీలించిన అనంతరం, బాలేశ్వర్‌ జిల్లా ఆస్పత్రిలో ఉన్న బాధితులను పరామర్శించారు. ఆయనతో పాటు రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌లు వెంట ఉన్నారు. అంతకుముందు, శనివారం ఉదయం ఇదే విషయమై ఉన్నతాధికారులతో దిల్లీలో సమీక్ష నిర్వహించారు.

ఇదిలాఉంటే, ఈ రైలు ప్రమాదంలో మరణించిన వారిసంఖ్య 288కి చేరింది. మొత్తం 747 మంది గాయాలు కాగా అందులో 56 మందికి తీవ్రగాయాలైనట్లు అధికారులు వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని