Delhi: మంత్రి నాతో తప్పుగా ప్రవర్తించారు: ఆప్‌ నేతపై ఐఏఎస్‌ అధికారి ఆరోపణ

దిల్లీ మంత్రి సౌరభ్‌ భరద్వాజ్‌(Saurabh Bharadwaj)పై ఐఏఎస్‌ అధికారి ఫిర్యాదు చేశారు. తనను బెదిరించారని అందులో ఆరోపించారు. 

Published : 19 May 2023 22:44 IST

దిల్లీ: ఐఏఎస్‌లు సహా ప్రభుత్వాధికారుల బదిలీలు, నియామకాలపై దిల్లీ ప్రభుత్వానికే (Delhi government)  నియంత్రణ ఉంటుందని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిన తర్వాత దిల్లీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. తీర్పు వెలువడిన సాయంత్రమే సేవల విభాగం కార్యదర్శి ఆశిష్‌ మోరె(Ashish More)ను పదవి నుంచి తప్పించారు. ఇప్పుడు ఆ మోరె.. ఆప్‌ మంత్రి సౌరభ్‌ భరద్వాజ్‌(Saurabh Bharadwaj)పై చీఫ్ సెక్రటరీ, లెఫ్టినెంట్ గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. ఆయన తనతో తప్పుగా ప్రవర్తించారని ఆరోపించారు. అయితే వీటిని అధికార ఆమ్ ఆద్మీ పార్టీ(AAP) తీవ్రంగా ఖండించింది. కోర్టు నిర్ణయాన్ని తోసిపుచ్చడానికి లెప్టినెంట్‌ గవర్నర్ వీకే సక్సేనా చేస్తోన్న కుట్ర అని విరుచుకుపడింది.

‘మే 16న మంత్రి భరద్వాజ్ నన్ను అతని ఛాంబర్‌కు పిలిచారు. నాతో తప్పుగా ప్రవర్తించారు. నాపై దాడి చేశారు. నన్ను బెదిరించారు. దీనిపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి. నాకు భద్రత కల్పించాలని కోరుతున్నాను’ అని మోరె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. మంత్రి ఈ ఆరోపణలను తోసిపుచ్చారు. తాను ఎలాంటి దాడికి పాల్పడలేదని, అతడి స్థాయిలో ఆరోపణలు చేస్తే, ఇక తాను ఏం చేయగలనని వ్యాఖ్యానించారు. మోరె తన నివాసంలోనే ఉన్నప్పటికీ ప్రభుత్వం పంపిన లేఖను తీసుకోలేదని మరోసారి వెల్లడించారు.

సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌(Chief Minister Arvind Kejriwal) చర్యలు తీసుకుంటున్నారు. సేవల విభాగం కార్యదర్శి ఆశిష్‌ మోరెను పదవి నుంచి తప్పించారు. అయితే బదిలీ వేటుకు గురైన ఐఏఎస్‌ అధికారి ఆశిష్‌.. అదృశ్యమవడం చర్చనీయాంశంగా మారింది. వాట్సప్‌ సందేశాలకూ ఆయన స్పందించడం లేదని, సెలవు సమాచారాన్ని ఇవ్వకుండా పరారీలో ఉన్నారని దిల్లీ సర్వీసెస్‌ శాఖ మంత్రి సౌరభ్‌ భరద్వాజ్‌ ఇదివరకు తెలిపారు. ఇటీవల కాంటాక్ట్‌లోకి వచ్చిన ఆశిష్‌ మంత్రిపై ఫిర్యాదు చేశారు. కానీ వీటిని ఆప్‌ తోసిపుచ్చింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని