UP Encounter: నా కుమారుడిని ఎన్‌కౌంటర్‌ చేయడం సరైనదే : గులామ్‌ తల్లి

గ్యాంగ్‌స్టర్‌ అతీక్‌ అహ్మద్‌ కోసం తన కుమారుడు పనిచేస్తున్నాడనే విషయం తెలియదని ఎన్‌కౌంటర్‌లో ప్రాణాలు కోల్పోయిన గులామ్‌ తల్లి పేర్కొన్నారు. అయినప్పటికీ పోలీసులు చేసిన చర్య సరైందనేనని స్పష్టం చేశారు.

Published : 15 Apr 2023 02:02 IST

లఖ్‌నవూ: ఉత్తర్‌ప్రదేశ్‌లో (Uttar Pradesh) గ్యాంగ్‌స్టర్‌, రాజకీయ నేత అతీక్‌ అహ్మద్‌ (Atiq Ahmad) కుమారుడు అసద్‌తోపాటు అతడి సహచరుడు గులామ్‌ పోలీస్‌ ఎన్‌కౌంటర్‌లో ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అయితే, గులామ్‌ మృతదేహాన్ని తీసుకునేందుకు అతడి తల్లి నిరాకరించారు. కుమారుడు కోల్పోయిన బాధ ఉన్నప్పటికీ..  యూపీ ప్రత్యేక కార్యదళం (స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌) ఎన్‌కౌంటర్‌ చేయడం ముమ్మాటికి సరైందేనని ఆమె స్పష్టం చేశారు.

‘ప్రభుత్వం తీసుకున్న చర్య కచ్చితంగా సరైనదే. దీని నుంచి గ్యాంగ్‌స్టర్లు, నేరస్థులందరూ గుణపాఠం నేర్చుకుంటారు. నా కుమారుడు గ్యాంగ్‌స్టర్‌ అతీక్‌ అహ్మద్‌ కోసం పనిచేసేవాడని నాకు తెలియదు. అతడి మృతదేహాన్ని నేను తీసుకోను. అతడి భార్య తీసుకుంటుందేమో’ అని ఓ వార్తా సంస్థతో గులామ్‌ తల్లి పేర్కొన్నారు. ప్రయాగ్‌రాజ్‌కు చెందిన న్యాయవాది ఉమేశ్‌పాల్‌ హత్య కేసులో నిందితులుగా ఉన్న అసద్‌తోపాటు గులామ్‌ అనే మరోవ్యక్తి కూడా ఎన్‌కౌంటర్‌లో చనిపోయాడు. గులామ్‌ కూడా ప్రయాగ్‌రాజ్‌కు చెందిన వ్యక్తే. భాజపా జిల్లా మైనార్టీ సెల్‌ మాజీ అధ్యక్షుడికి సోదరుడు. గ్యాంగ్‌స్టర్‌ అసద్‌ అహ్మద్‌తో కలిసి గులామ్‌ పనిచేసేవాడు. అసద్‌, గులామ్‌లపై రూ.5 లక్షలు చొప్పున రివార్డు ఉంది. ఝాన్సీలో యూపీ ప్రత్యేక కార్యదళం ఎన్‌కౌంటర్‌లో వీరిద్దరూ హతమయ్యారు.

మరోవైపు ఉమేశ్‌పాల్‌ హత్య కేసులో అతీక్‌ అహ్మద్‌కు జీవిత ఖైదు పడడంతో ప్రస్తుతం గుజరాత్‌లోని సబర్మతీ జైల్లో ఉన్నాడు. గురువారం అతీక్‌ను, అతడి సోదరుడు అష్రఫ్‌ను ఓ కేసు విచారణ నిమిత్తం ప్రయాగ్‌రాజ్‌లోని కోర్టుకు తీసుకువచ్చారు. వారు న్యాయస్థానంలో ఉండగానే అసద్‌ ఎన్‌కౌంటర్‌ సమాచారం తెలిసింది. కోర్టులోనూ, అక్కడి నుంచి జైలుకు తీసుకెళ్తున్నప్పుడు కుమారుడిని తల్చుకొని అతీక్‌ విలపిస్తూ.. ‘నా బిడ్డ చావుకు నేనే కారణం’ అంటూ కన్నీరుపెట్టుకున్నాడు. అంతకుముందు రోజే తన కుటుంబాన్ని ఇబ్బందులు పెట్టవద్దంటూ మీడియా ముందు అతీక్‌ మొరపెట్టుకున్న కొన్ని గంటల్లోనే అతడి కుమారుడు ఎన్‌కౌంటర్‌లో చనిపోవడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు